Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- చిట్యాల
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా పేదలను వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందించడమే కాకుండా, లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రజాకారుల, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలతో వృత్తిదారులు సాధించుకున్న లక్షల ఎకరాల భూమిని ఈనాటి పాలకులు కారుచౌకగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పటం సరికాదన్నారు. నియంతృత్వ నిజాం ముస్లిం అని ప్రచారం చేసే వాళ్లకు.. వేలాది ఎకరాల భూమిని కలిగి ఉన్న విసునూరు, దేశ్ముఖ్ల అకృత్యాలను హిందూ మతం వారు చేశారని అనలేమని మతతత్వ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. నిజాంను కీర్తించే కేసీఆర్ నాటి కమ్యూనిస్టు నాయకులు, పేదల ప్రాణ త్యాగాలను గుర్తించలేకపోయారని భావించాల్సి వస్తుందన్నారు. దళితబంధు రాష్ట్రమంతటా వర్తింపజేయటంతో పాటు, ప్రతి పేద కుటుంబానికీ మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, విధానాలను ఎండగట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఈనెల 27వ తేదీన తలపెట్టిన ఆందోళన, పోరాటాలకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.
నాయకులు జిట్ట నగేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నాయకులు పామనుగుళ్ల అచ్చాలు, శీలా రాజయ్య, కత్తుల లింగస్వామి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుమ్మరి శంకర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.