Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించింది. ఈ పథకం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలనా పరమైన అనుమతులను మంత్రివర్గం ఆమోదించింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆంధోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని కేబినెట్ ప్రతిపాదించింది. దీని ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాలకు సాగునీరందుతుంది.
ఈ ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమలిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15,16లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం)కు నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.