Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలుగా అందని వేతనాలు
- నేటినుంచి దశలవారీగా నిరసనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాల చెల్లింపుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్ఏ-475) విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, నాయకులు సయ్యద్ జబీ, వస్కుల శ్రీనివాస్, శోభన్బాబు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల నుంచి జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశాల ప్రకారం అదేరోజు రెండు నెలల జీతాలు విడుదల కావడంతో సంతోషపడ్డామని వివరించారు. జీతాలు విడుదలై 16 రోజులు గడిచినా అధికారుల నిర్లక్ష్యంతో ఆదాయపు పన్ను విషయంలో మరో కొత్త సమస్యను సృష్టించారని విమర్శించారు. దీంతో జీతాలు రాకుండా ఆపేశారని తెలిపారు. తమ జీతాలను ఐటీ సెక్షన్ 194 (జే)లో చేర్చి కాంట్రాక్టు అధ్యాపకులు అదనపు ఆదాయం తీసుకుంటున్నారనే పేరిట లేనిపోని సెక్షన్లు మోపి జీతాలనుంచి 10 శాతం టీడీఎస్ కోతకు అంగీకరిస్తేనే జీతాలు ఇస్తామని కొత్త నిబంధనలు చూపిస్తున్నారని వివరించారు. ఇది అన్యాయమనీ, కాంట్రాక్టు అధ్యాపకులకు 194 (జే) వర్తించబోదని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వ కాలేజీలో పూర్తి సమయం పనిచేస్తూ ఒకే చోట, ఒకే వేతనం పొందుతున్నామనీ తెలిపారు. కానీ సెక్షన్ 192 ప్రకారం వారు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారంటూ, చార్టెడ్ అకౌంటెంట్, పలువురు నాయకులు ఇంటర్ విద్యా కమిషనర్కు వివరించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీఎస్ కోత లేకుండా జీతాలిచ్చే వరకు శుక్రవారం నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి కాలేజీల్లో నిరసన తెలిపాలనీ, ప్రిన్సిపాళ్లు, ఆయా జిల్లాల అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని కోరారు.