Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిచావ రవి
- పలు జిల్లాల్లో నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నెల మొదటి తేదీన చెల్లించాలనీ, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీయస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. గురువారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయం ముందు ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చావ రవి పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రంలో వేతనాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల మొదటి తేదీన వేతనం తీసుకోవడం ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కు అని అన్నారు. వైద్య బిల్లులు, జీపీఎఫ్ రుణాలు, డీఏ బకాయిలు, పెన్షనర్ల బిల్లులు, ఇతర ఏరియర్ బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి రావడం దుర్మార్గమనీ, నిర్దేశిత సమయం విధించి వెంటనే బిల్లులన్నింటిని మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ వెంటపల్లి సత్యనారాయణకు మెమోరాండం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఎస్టీవో, భద్రాచలంలోని ట్రెజరరీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో డీటీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీఓకు వినతిపత్రం అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీటీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల డీటీఓ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయం, సుల్తానాబాద్లోని సబ్ ట్రెజరీ కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో ట్రెజరీ కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపి డీటీఓకు వినతిపత్రం ఇచ్చారు.