Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్, అటవీ శాఖల మధ్య తేలని వైరం
- నిధులు కొరత తలెత్తే అవకాశం
- పీఆర్ ఇంజినీరింగ్ అధికారుల మల్లగుల్లాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ విధానం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, అటవీశాఖల మధ్య తగవుపెట్టేలా కనిపిస్తున్నది. ఇందుకు అటవీప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఇందుకు అవకాశం కల్పిస్తున్నది. వన్యప్రాణుల సంచారానికి ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణం జరగాలని అటవీశాఖ చెబుతుంటే, ఆ షరతులతో రోడ్ల ఏర్పాటుకు సర్కారు ఇచ్చిన నిధులు సరిపోవని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల మనోగతంగా ఉంది. అంతేగాక అడవుల్లో రహదారుల నిర్మాణం అంత సులభమేమీ కాదని అంటున్నారు. ప్రధానంగా రాష్ట్రం లోని వన్యప్రాణులు ఉన్న ప్రాంతాల్లో ఈసమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఇంజినీరింగ్ శాఖ భావిస్తున్నది. ఈ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, అటవీశాఖల మధ్య సమన్వయ సమావేశాలు జరిగాయి. అయినా ఒక పట్టాన తెమలడం లేదు.
26 రోడ్లు...92 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పలు అటవీప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం రూ. 92.16 కోట్లు మంజూరు చేసింది. వీటిని అవసరమైన జిల్లాల్లో ఖర్చుచేయాలని ఆదేశించింది. ముఖ్యంగా టైగర్ జోన్లు, వన్య ప్రాణులు అధికంగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మార్గదర్శకాలు జారీచేసింది. దాదాపు 153.8 కిలోమీటర్ల మేర 26 రోడ్లను నిర్మించేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు సంబంధిత శాఖ రోడ్ల సర్వే పనులు, ఇతర అధికారిక అనుమతుల కోసం ప్రయత్నాలు ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. అందులో ప్రధానమైనవి అటవీ అనుమతులు. జంతు సంచారానికి అనువుగా రోడ్ల నిర్మాణం జరగాలనీ, అండర్పాస్ బ్రిడ్జిలు, చెక్పోస్టులు, సైన్బోర్డులు, ఇతర పనులు తమ నిబంధనల ప్రకారం జరగాలని అటవీశాఖ నిక్కచ్చిగా చెబుతున్నది. దీనిపై పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ శాఖ మాత్రం మల్లగుల్లాలు పడుతు న్నది. దీనికి ప్రధాన కారణం నిధుల సమస్య. అటవీశాఖ నిబంధన లను నెరవేర్చాలంటే సర్కారు ఇచ్చిన నిధుల్లో సుమారు రూ. 12.30 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చని అంటున్నది. అంతేగాక రాష్ట్ర అటవీశాఖనే కాకుండా జాతీయ వన్యప్రాణీ బోర్డు సైతం పీఆర్ ఇంజినీరింగ్ రోడ్ల ప్రతిపాదనలకు గ్రీన్సిగల్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అనుమతులు రాకపోతే రోడ్ల నిర్మాణం దుర్లభమే. జాతీయ వణ్యప్రాణి బోర్డు ఇంకా ఏవైనా ప్రత్యేక నిబంధనలు పెడితే, బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ తరుణంలో ఏమిచేయాలో ఇంజినీరింగ్ శాఖకు పాలుపోవడం లేదు. ఇదిలావుండగా అటవీభూమిని ఇతర అవసరాలకు వినియోగించేందుకు కొంత మొత్తాన్ని కూడా అటవీశాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో అడవుల్లో పీఆర్ రోడ్ల నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదనపు బడ్జెట్ అవసరం
అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయిం చిన రూ. 92.16 కోట్లు ఎంతమాత్రం సరిపోవనే అభిప్రాయం ఇంజినీరింగ్ శాఖలో ఉంది. కాగా అటవీ అనుమతుల కోసం కేటా యించిన బడ్జెట్లో రూ. 12 కోట్లు పోతే, ఇంకా నిధులు సమస్య తీవ్రం కానుంది. 153.6 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి గాను 103.8 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉండటం గమ నార్హం. ఈనేపథ్యంలో పూర్తిస్థాయి రోడ్ల ప్రణాళికలు పూర్తయిన తర్వాత అదనపు బడ్జెట్ కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని భావిస్తున్నది.
మూడు జిల్లాల్లో
అటవీప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఇంజినీరింగ్ విభాగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ముఖ్యంగా మూడు టైగర్ జోన్ ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల , ఉమ్మడి ఆదిలాబాద్లోని కవ్వాల్, కొత్తగూడెంలోని కిన్నెరసాని అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఏనుగులు, జీరాఫ్లు ఉన్న చోట జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో ఈ తరహా జంతువులు లేవని ఇంజినీరింగ్ విభాగం భావిస్తున్నది.