Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులను స్వీకరించాలి
- ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు నోటిఫికేషన్ ఇవ్వాలి
- మార్గదర్శకాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రయివేటు (మైనార్టీ, నాన్మైనార్టీ) ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లను వచ్చేనెల 15లోగా భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులను స్వీకరించాలని కోరింది. మూడు దినపత్రికల్లో (ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ) ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రతిరోజూ కాలేజీలోని నోటీసు బోర్డులో, వెబ్సైట్లో ప్రదర్శించాలని తెలిపారు. ఇంటర్మీడియెట్లో 35 శాతం మార్కులొచ్చిన విద్యార్థులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లు బీ కేటగిరీలో భర్తీ అవుతాయని వివరించారు. అయితే బీ కేటగిరీలోని సీట్లను బ్రాంచ్ల వారీగా ప్రకటించాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి బ్రాంచ్ వారీగా మెరిట్ జాబితాను ప్రకటించాలని కోరారు. భర్తీ చేసిన వివరాలను ఉన్నత విద్యామండలికి ఎప్పటిలోగా పంపించాలనేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
ఇప్పటికే సీట్లు భర్తీ చేసిన కాలేజీలు
ఇప్పటికే కొన్ని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేశాయి. డిమాండ్ ఉన్న బ్రాంచ్లకు చెందిన సీట్లలో విద్యా ర్థులు చేరారు. సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఐవోటీ, ఐటీ వంటి కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉన్నది. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే విద్యా ర్థులు, తల్లిదండ్రులతో బేరసారాలు పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. కాలేజీని బట్టి సీఎస్ఈలో ఒక్కో సీటు రూ.6 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వసూలు చేస్తు న్నట్టు సమాచారం. ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను బట్టి పత్రికల్లో నోటిఫి కేషన్లు ఇవ్వడం, విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించడం నామమాత్రమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీట్లు కేటాయించిన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యామండలికి పంపించడమే తరువాయి.