Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) ఆధ్వర్యంలో ఘనంగా సత్కారించారు. గురువారం హైదరాబాద్లోని పోరాట యోధుల ఇండ్లలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పూలమాలలు వేసి, నూతన వస్త్రాలతో అపూర్వంగా సన్మానించారు. సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, జైనీ మల్లయ్య, కందిమళ్ల ప్రతా పరెడ్డి దంపతులకు, బండ్రు నరసింహులను సన్మానించారు. ఈ సందర్భంగా టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా ఆనాడు మూడువేల గ్రామాలు వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందాయని చెప్పారు.ఆ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందన్నారు. కుల,మతాలకు అతీతంగా జరిగిన ఆ మహాత్తర పోరాటాన్ని బీజేపీ మతపరమైన పోరాటంగా చిత్రీకరిస్తున్నదని విమర్శించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ చరిత్రకు మతం రంగు పులుతుతున్నదని తెలిపారు.
ఇది విముక్తి పోరాటం : మల్లు స్వరాజ్యం
తెలంగాణ సాయుధ పోరాటం హిందువు,ముస్లిం పోరాటం కాదనీ, భూమి కోసం , భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటామని చెప్పారు. కమ్యూనిస్టుల త్యాగాల చరిత్రను వక్రీకరిస్తున్న బీజపీ వైఖరిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాషాయ మూకల కట్టుకథలు ఎవ్వరు నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి కె హిమబిందు, బొజ్జబిక్షమయ్య, భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.