Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- హోం మంత్రి చైర్మెన్గా పోలీస్ స్టేషన్లపై సబ్ కమిటి
- ఆర్టీసీ చైర్మెన్గా బాజిరెడ్డి గోవర్దన్
- రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మెన్గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సభ్యులుగా ఉంటారు. దీంతోపాటు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఇతర ఠాణాల సమస్యలపై సమీక్షించేందుకోసం హోం మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మరో కమిటీని నియమించింది. మంత్రులు హరీష్రావు, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజరు కుమార్ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని ప్రగతి భవన్లో గురువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానించారు. వర్షాపాతం, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగైన భూమి, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై క్యాబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోళ్లు, అందుకోసం మార్కెటింగ్ శాఖ సన్నద్ధత తదితరాంశాలను మంత్రివర్గంలో సమీక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో మంత్రివర్గం ఆరా తీసింది. వివిధ రాష్ట్రాల్లోని కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వారు సీఎంకు సమాచారాన్ని అందించారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితులపై కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. బడులు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు సీఎంకు వివరించారు. ఈ క్రమంలో రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందనీ, స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురువారం నుండి ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపిటీసిలు, జడ్పిటీసిలు, ఎంపిపి, జడ్పీ చైర్పర్సన్, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు తదితిర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు. మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలనీ, ప్రతిరోజు మూడు లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆయన ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి వీలుగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంపై మంత్రివర్గం సమీక్షించింది. సంబంధిత ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలనీ, అత్యంత వేగంగా వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించింది. ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిధ్దంగా ఉన్నామని వైద్యాధికారులు మంత్రివర్గానికి వివరించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని సిద్ధం చేశామన్నారు. చిన్నపిల్లల వైద్యం కోసం మరో 5,200 బెడ్లను ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి కోసం సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేయాలనీ, తదుపరి కేబినెట్ సమావేశం నాటికి వాటిని సమర్పించాలని మంత్రివర్గం ఆదేశించింది.
ఇతర నిర్ణయాలు
- ఆర్టీసీ చైర్మెన్గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ నియామకం
- ఈనెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
- ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే యేడాది నుంచి... మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం
- రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతుకు ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయింపు
- రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కోరిక మేరకు, నారాయణ గూడలో 1,261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయింపు