Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడి ఆత్మహత్య.. అంత్యక్రియలు పూర్తి
- పచ్చబొట్టు ఆధారంగా రాజుగా గుర్తించాం : వరంగల్ సీపీ
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
ఆరేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు పల్లంకొండరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజుమృతదేహాన్ని వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్పై గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా అది రాజు మృతదేహమని నిర్ధారించినట్టు చెప్పారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యులు పోస్ట్మార్డం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంటనే వరంగల్, పోతన నగర్లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఈ నెల 9న హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య అనంతరం నిందితుడు రాజు కనిపించకుండా పోయాడు. రోజులు గడుస్తున్నా నిందితుడ్ని పోలీసులు పట్టుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. సుమారు వెయ్యి మంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడపట్టారు. అన్ని వైపులా పోలీసులు నిందితుడ్ని చుట్టుముట్టడంతో రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నుండి నష్కల్ స్టేజి మధ్యనున్న రాజారాం రైల్వే బ్రిడ్జి నంబర్ 436 యూపీ, 309/3 మైలురాయి వద్ద వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలుకింద పడి గురువారం ఉదయం సుమారు 8.40గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విధినిర్వహణలో ఉన్న రైల్వే కీ మేన్స్ కుత్తురి సారంగపాణి, తాటి కుమార్.. అదే ట్రాక్ వెంబడి అటుగా వస్తుండగా గడ్డం కలిగిన యువకుడు చెట్ల పొదల్లోంచి బయటికి రావడం చూశారు. అనుమానాస్పదంగా ఉన్నాడనీ, బాలిక హత్యకు కారకుడైన వ్యక్తేనని గమనించి నిందితున్ని ప్రశ్నించే లోపే వారిద్దరినీ ప్రతిఘటించి పరుగెత్తాడు. పక్కనే వ్యవసాయ క్షేత్రంలో పొలానికి మందు చల్లుతున్న గేమ్య తండాకు చెందిన భూక్య రామ్సింగ్, గేమ్యా సింగ్ సోదరులకు తెలిపి, పట్టుకునే లోపే రాజు పరిగెత్తుకుంటూ వెళ్లి రైల్వే ట్రాక్పై రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే రైల్వే కార్మికులు 100కు డయల్ చేసి సమాచారమిచ్చారు. స్థానిక ఎస్ఐలు రమేష్నాయక్, శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహం చేతిపై ఉన్న మౌనిక పచ్చబొట్టు, తలకు ఉన్న ఒత్తు జుట్టును బట్టి రాజుగా గుర్తించారు. ఏసీపీ రఘునాథ్ వైభవ్, జీఆర్పీ సీఐ రామ్మూర్తి, అనంతరం డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీపీ తరుణ్ జోషి ఘటనా స్థలికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశానుసారం ఈ ప్రాంతంలో కూడా నిందితుడు రాజును పట్టుకునేందుకు పకడ్బందీగా గాలింపు చర్యలు ముమ్మరం చేశామనీ, ఈ క్రమంలో ఇక్కడ మృతదేహం లభ్యమైందని తమ సిబ్బంది తెలపడంతో వచ్చామని అన్నారు. నిందితుడు రాజు ఈ ప్రాంతానికి ఎప్పుడు, ఎలా వచ్చాడనేది విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జీఆర్పీ సీఐ రామ్మూర్తి మాట్లాడుతూ.. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట చిల్పూర్ మండల ఎస్ఐ మహేందర్, ట్రెయినీ ఎస్ఐ కమలాకర్ ఉన్నారు.