Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి ఎన్పీఆర్డీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆసరా పింఛన్లు వెంటనే చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధ్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రామీణ అభివృద్ధి కమీషనర్, సెర్ప్ సీఈవోకు వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా పంపినట్టు అ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 40 లక్షల మంది ఆసరా పింఛన్ దారులు ఉన్నారనీ, వీరిలో4.97లక్షల మంది వికలాంగులు పెన్షన్లు పొందుతున్నారని తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలోనే పింఛన్లు చెల్లించాల్సినప్పటికీ ఈ నెలలో ఇప్పటి వరకూ పింఛన్లు రాలేదని పేర్కొన్నారు. ఆసరాతో వికలాంగులను ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నదో చెప్పాలని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పింఛన్లకు అవసరమైన రూ.11,728 కోట్లను బడ్జెట్లో కేటాయించినప్పటికీ, ప్రతి నెల వాటి కోసం లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.దీంతో పింఛన్ల మీదనే ఆధార పడిన వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, వికలాంగులు మందులు కొనుక్కోవడానికి పింఛన్ల మీదనే ఆధారపడుతున్నారనీ,వారు ఇప్పుడు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న జూలై, ఆగస్టు నెలల పింఛన్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.