Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 36 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పాఠశాలలను ప్రభుత్వం జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 36 కేజీబీవీలను ఇంటర్మీడియెట్ స్థాయికి పెంచామని తెలిపారు. బాలికలు చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేజీబీవీలు వారి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపబోతున్నాయని వివరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2021-22) నుంచే ఈ కేజీబీవీలో ఇంటర్ ప్రవేశాలు చేపడతామనీ, తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. వాటిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్సులున్నాయని తెలిపారు. ఒక్కో గ్రూపులో 40 చొప్పున సీట్లుంటాయని వివరించారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయనీ, వాటిలో ఇప్పటికే 172 ఇంటర్మీడియెట్ స్థాయి వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 36 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించడంతో స్థానికంగా ఉన్న పేద విద్యార్థినిలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంటర్ చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వాటిలో చదివే బాలికలకు అన్ని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. పౌష్టికాహారంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు, కరాటే, యోగా, ధ్యానం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 475 కేజీబీవీలున్నాయి. 2018-19 విద్యాసంవత్సరంలో 88, 2019-20 విద్యాసంవత్సరంలో 84, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 36 కలిపి జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించిన కేజీబీవీల సంఖ్య 208కి చేరింది. అన్నింటిలోనూ ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియ జరుగుతున్నది.