Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం రేకేత్తిస్తున్న డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్కు ప్రమేయం ఉందనీ, అందు కోసమే పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తు జరగకుండా ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పేర్కొన్నారు. శుక్రవారం ఈమేరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చిన మారక ద్రవ్యాలు దేశంలో తయారవుతున్నవికావనీ, ఇతర దేశాల నుంచి సినీతారలకు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగేండ్ల క్రితం డ్రగ్స్ వ్యవహారం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బందం ఏర్పాటైందన్నారు. అందులో 12 మందిని చేర్చడంపై అనుమానాలున్నాయని తెలిపారు. సినీతారలతో కేటీఆర్కు సంబంధాలున్నాయనీ, మనీలాండరింగ్ వ్యవహారాలల్లోనూ ఆయన ప్రమేయముందని ఆరోపిస్తూ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన కొన్ని వీడియోల వివరాలను ఈడీకి సమర్పించినట్టు తెలిపారు. మంత్రి హౌదాలో కేటీఆర్ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల పర్యటనలతోపాటు వ్యక్తిగతంగా చేసిన పర్యటన వివరాలను కూడా పరిశీలించాలని కోరారు. దిశ లైంగికదాడి నుంచి మొన్న జరిగిన చైత్ర హత్య వరకు నేరాలు చేసిన వాళ్ళంతా మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తుకు బానిసలైన వారేనని వివరించారు. తెలంగాణ రాష్ట్ర మత్తు పదార్థాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.