Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల అవస్థలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్భవన్ లోని ఆర్టీసీ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. 17వ తేదీ దాటినా ఇప్పటికీ జీతాలు ఖాతాల్లో పడకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 24 వేల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. రెండు నెలలుగా కార్మికులకు జోన్ల వారీగా జీతాలు చెల్లిస్తున్నారు. ఎవరికి ఎప్పుడు జీతం ఖాతాలో పడుతుందో అర్థంకావట్లేదు. కొన్ని జోన్లకు ఈనెల 13, 14 తేదీల్లో జీతాలు వేశారు. గ్రేటర్ హైదరాబాద్, బస్భవన్ ఉద్యోగులకు మాత్రం 17వ తేదీ దాటినా చెల్లించలేదు. జీతాల విషయాన్ని అధికారులు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారా...లేదా అనే విషయం ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల్లో చర్చనీయాంశంగా ఉంది. ఇకపై ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఎమ్డీగా బాధ్యతలు తీసుకునే సమయంలో సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే. కార్మికులు పిల్లల చదువులు, వ్యక్తిగత, గృహ రుణాల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల ఈఎమ్ఐలు బౌన్స్ అయ్యి, తమ సిబిల్ స్కోర్పై ప్రభావం పడుతున్నదనీ, దానివల్ల కొత్త రుణాలు పుట్టే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్డీ సజ్జనార్ జోక్యం చేసుకొని జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అందరికీ ఒకేసారి జీతాలివ్వాలి
ఆర్టీసీ కార్మికులందరికీ ఒకేసారి, ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి. ఈనెల 17వ తేదీ దాటినా ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదు.కార్మికులు అవస్థ పడుతు న్నారు. కొత్త ఎమ్డీ సజ్జనార్ జోక్యం చేసుకొని,జీతాలు ఇప్పించాలి. బ్యాంకు రుణం రూ.500 కోట్లతో పాటు రోజువారీ ఆదాయం వస్తున్నా, జీతాలు టైంకి ఇవ్వకపోవడం సరికాదు.
- వీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
అన్యాయం..
కార్మికులకు 17వ తేదీ దాటినా జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం. సంస్థ ఆర్థికంగా కుదుటపడుతున్నా, కార్మికులను విభజించి జీతాలు చెల్లిస్తున్నారు. ఇది సరికాదు. కొత్త ఎమ్డీ సజ్జనార్ దృష్టికి అధికారులు ఈ విషయం తీసుకెళ్లినట్టు లేదు. తెలిస్తే...ఆయన పరిష్కరిస్తారనే విశ్వాసం ఉంది.
- ఎమ్ నరేందర్, కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్