Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనీ, అందులో భాగంగా పోడు సమస్య పరిష్కారం కోసం వేసిన మంత్రి వర్గ ఉపసంఘం తొలి సమావేశం శనివారం జరుగనున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అజంనగర్ రేంజ్ పందిపంపుల గ్రామ పరిధిలో అటవీ అధికారులు, సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని అరణ్య భవన్ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా బాధిత రేంజ్ అధికారి గూడూరి దివ్య, ఇతర సిబ్బందితో మంత్రి నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు, ఇతర ప్రభుత్వ శాఖలు స్పందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలనీ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అటవీ పునర్జీవన పనులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కలెక్టర్, డీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
గిరిజన ప్రాంత ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. దాడులతో సమస్య పరిష్కారం కాదన్నారు. దాడులకు వెరవకుండా విధి నిర్వహణలో పాల్గొన్న రేంజ్ ఆఫీసర్ తో పాటు, అటవీ సిబ్బందిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి ప్రశంసించారు. దాడులు పునరావృతం కాకుండా, నిందితులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లాల వారీగా ఏర్పాటైన ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీలు ఇలాంటి ఘటనలపై తక్షణం స్పందించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ కోరారు.
ఉద్యోగ ధర్మంలో భాగంగా ఫీల్డ్ విజిట్కు వెళ్లిన సిబ్బందిపై దాడి చేయటం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, ఫారెస్ట్ రేంజ్ అధికారుల సంఘం, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ తరపున ప్రతినిధులు దాడి ఘటనను ఖండించారు. ప్రభుత్వం తమకు అండగా ఉన్నందుకు మంత్రితో పాటు ఉన్నతాధికారులకు వారు కృతజతలు తెలిపారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.