Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూసేకరణ కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ - రామడుగు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం భూసేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఎంజారుమెంట్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాకొద్దు.. ఈ అదనపు టీఎంసీ.. నీటి తరలింపు కోసం మాభూములను లాక్కోవద్దంటూ మండల కేంద్రంలోనే అధికారులను అడ్డుకున్నారు. గతంలోనే వరద కాలువ నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయామన్నారు. మళ్లీ మరో అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం ఉన్నకాడికి భూములు లాక్కుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కోమల్రెడ్డి, ఆర్డీవో ఆనంద్ కుమార్ రైతుల వద్దకు వచ్చి సముదాయించారు. ఆర్డీవో ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. అదనపు టీఎంసీలో భాగంగా భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. దానికి మీ డిమాండ్స్ ఏమైనా ఉంటే తెలియజేయాలే తప్ప అడ్డుకోవడం సరికాదన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిక పంపించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.