Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బసవతారకం హాస్పిటల్కు భారీ సాయం
హైదరాబాద్ : సామాజిక సేవ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మెన్ దినేష్ ఖార అన్నారు. బాధ్యత కలిగిన కార్పొరేట్ సిటిజన్గా సమాజానికి అర్థవంతమైంది చేయాలనే ఉద్దేశంతో ఎస్బీఐ పలు సేవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని లోకల్ హెడ్ ఆఫీస్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా బసవతారకం - ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్ట్యూట్ ఏర్పాటు చేయనున్న మొబైల్ కాన్సర్ స్రీనింగ్ యూనిట్కు రూ.1.50 కోట్ల చెక్ను అందించారు. ఈ వాహనంలో కాన్సర్ నిర్ధారణ పరీక్ష పరికరాలు ఉంటాయి.
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాల్లో అత్యంత చురుకుగా ఉంటున్న విషయం తెలిసిందే. గడిచిన 18 మాసాలుగా దేశం, ప్రపంచం తీవ్ర వైద్య సవాళ్లను ఎదుర్కొంటుందని ఖార పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైద్యం కంటే గొప్పది ఏదీ లేదని తేలిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఈ రంగానికి రెండు శాతం కేటాయింపులను పెంచిందన్నారు. బసవతారకం హాస్పిటల్ సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హైదరాబాద్ సర్కిల్ సీఎస్ఆర్ సేవల కోసం రూ.3.50 కోట్ల వరకు మద్దతును అందించిందన్నారు.