Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఎనిమిది మందికి పదోన్నతి : కొలిజియం సిఫారసు
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులు కానున్నారు. అలాగే ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాను నియమించనున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, అలాగే హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కర్నాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును హర్యానా, పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నత లభించింది. పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి చత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీ కానున్నారు. మొత్తం ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 25 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలిజియం సిఫార్సు చేయాలని నిర్ణయించింది. మరో ముగ్గురు న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
1961 నవంబరు 30న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జన్మించారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తండ్రి బిఎన్ శర్మ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి చెందడంతోపాటు జబల్పూర్ యూనివర్సిటీ ఉపకులపతిగా పనిచేశారు. తల్లి శాంతి శర్మ జబల్పూర్ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జస్టిస్ సతీష్ చంద్ర ప్రాథమిక విద్యాభ్యాసం క్క్రెస్ట్చర్చ్ బార్సు హయ్యర్సెకండరీ స్కూల్లోనూ జబల్పూర్ సెంట్రల్ స్కూల్లో 12 వరకూ చదివారు. 1981లో హరి సింగ్ గౌర్ యూనివర్శిటీ నుంచి బిఎస్సీ పట్టా అందుకున్నారు. అదే యూనివర్శిటీలో న్యాయ పట్టా అందుకొని 1984 సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ బార్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ విషయాల్లో ప్రాక్టీస్ చేశారు. 1993 మే 28లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2004 జూన్ 28న భారత ప్రభుత్వం సీనియర్ ప్యానెల్ కౌన్సెల్గా నియమితులయ్యారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా గౌరవం పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15 న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ శర్మ పలు విశ్వవిద్యాలయాలకు సేవలందించారు. నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్శిటీ భోపాల్ సలహా బోర్డులో సేవలందించారు. న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై పరిశోధన వ్యాసాలు, పత్రాలు రాశారు. 2021 జనవరి 4న కర్ణాటక హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.