Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ నిర్ణయంతో మూతపడనున్న 700 మిల్లులు
- రోడ్డున పడనున్న లక్ష మంది హమాలీలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో అటు రైతులు.. ఇలు మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు జరగనున్న నష్టంతో పాటు రైస్ మిల్లులు మూతపడనున్నాయి. ఇందులో పని చేసే సుమారు లక్ష మంది హమాలీ కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యేడాది 11,67,542 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో దొడ్డు రకం 4,91,549 ఎకరాలు కాగా, సన్న రకం 6,99,941 ఎకరాలు. 27.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. సుమారు 20 ఏండ్ల నుంచి కేంద్రాల ద్వారానే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది.
రైస్ మిల్లుల ప్రస్థానం ముగిసినట్లేనా ?
రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు రైసు మిల్లులకు పంపిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిల్లులన్నీ మూతపడనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 700 వరకూ రైస్ మిల్లులు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే ఎక్కువగా మిల్లులున్న జిల్లా కూడా ఇదే. ఇందులో సుమారు లక్ష మంది హమాలీలు పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడున్న 700 పారాయిబాల్డ్ మిల్లులు కస్టమ్ మిల్లింగ్ రైస్పైనే ఆధారపడి నడుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే మిల్లులన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయకపోతే ఆ మిల్లులు మూత పడనున్నాయి. ఫలితంగా అందులో పనిచేసే లక్ష మంది హమాలీ కార్మికులు జీవనోపాధి కోల్పోనున్నారు.
ఒక్కో రైస్ మిల్లు ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకూ వినియోగించాల్సి ఉంటుంది. అంటే 700 మిల్లులకు రూ.10,500 కోట్లు ఖర్చు చేశారు. 4000 మంది యజమానులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ కుటుంబాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు, రైస్ మిల్లుల యజమానులు కోరుతున్నారు.
ఉపాధిని దూరం చేసే కుట్ర
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైస్ మిల్లుల్లో పనిచేసే లక్ష మంది మమాలీ కార్మికులు, వారిపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి పోతుంది. కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పునరాలోచించాలి.
- తుమ్మల వీరారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
రైతులకు తీవ్ర నష్టం
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు స్వయంగా ప్రయివేటుగా విక్రయించు కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గిట్టుబాటు ధర అమలు కాదు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతాడు. మాకున్న శక్తి మేరకు ధాన్యం కొనుగోలు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తాం.
- నారాయణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు