Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది స్మగ్లర్ల అరెస్టు
- రూ.32 లక్షల విలువ గల గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు వేర్వేరు ఘటనల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు రూ.32 లక్షల విలువైన 318 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, మూడు ఆటోలు, 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వర్ధన్నపేట, నల్లబెల్లి, ఖానాపూర్ ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ముఠాలుగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్కు పూనుకున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని సిలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం రహస్యంగా కారులో విశాఖపట్నం, రాజమండ్రి, భద్రచలం, కొత్తగూడెం, నర్సంపేట, ఖమ్మం పట్టణాలతో పాటు వరంగల్ పోలీస్ కమిషరేట్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు గంజాయిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మూడు ఘటనల్లో నిందితులు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్టుగా టాస్క్ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దాంతో ఆయా ప్రాంతాల పోలీసులతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. వర్ధన్నపేట, డీసీ తండా వద్ద కారులో 128 కిలోల గంజాయి, నల్లబెల్లిలో రామతీర్థం గ్రామ శివారులో ఒక కారు, ఆటోలో 134 కిలోల గంజాయి, ఖానాపూర్ గ్రామ శివారులో రెండు ఆటోల్లో 56కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఈ మూడు ఘటనల్లో నిందితులైన ఆంద్ర్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బోరం సాయికుమార్, గాటంపల్లి వెంకట్, గోదవర్తి శేషుకుమార్లతో పాటు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన భూక్య రాములు, ఎస్కె.ఖలీల్, కరీంనగర్ జిల్లాకు చెందిన కొనమాల సునిల్, భద్రాద్రి కొత్తగూడెంలోని సారపాకకు చెందిన బత్ర నరేష్, తూముల క్రాంతికుమార్, తుమ్మల నాగరాజు, జి.మనోజ్, మారంపూడి శ్రీనులను పటుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్, ఈస్ట్ జోన్ డీసీపీలు శ్రీనివాస్రెడ్డి, వెంకటలక్ష్మి, వర్ధన్నపేట, నర్సంపేట టాస్క్ఫోర్స్ ఏసీపీలు ప్రతాప్కుమార్, రమేష్, ఫణీందర్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్, వర్ధన్నపేట, నర్సంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్లు సదనకుమార్, సతీష్, ఎస్.ఐ రామారావు, నల్లబెల్లి, ఖానాపూర్ ఎస్ఐలు, టాస్క్ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సొమలింగం, కానిస్టేబుళ్లు శ్రీను, వి.రాజేష్, రాజు, జె.రాజేష్, హౌంగార్డ్ విజరులను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అభినందించారు.