Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా రోగుల్లో మొదటి వేవ్లో 23 శాతం,
- రెండో వేవ్ లో 32.76 శాతం మరణాలు
- రిస్కు గ్రూపులకు వ్యాక్సినేషన్ పూర్తి కాని ఫలితం
- నెఫ్రో ప్లస్ అధ్యయనంలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. ఈ ఏడాది జనవరి 15 తర్వాత మొదలెట్టిన వ్యాక్సినేషన్ కోసం రిస్కు గ్రూపులను గుర్తించింది. అయితే తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆ రిస్కు గ్రూపుల్లో ఉన్న వారిలో అత్యధికమంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని ఫలితంగా వైరస్ వ్యాప్తి, మరణాలు తగ్గటం లేదు. మొదటి, రెండో . డయాబెటీస్, బీపీతో పాటు మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు తదితరులను రిస్కు గ్రూపుగా గుర్తించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో వారికి మొదట టీకాలు వేయాలని వైద్యనిపుణులు కూడా సూచించారు. అయితే ఆ సూచనలను కచ్చితంగా అమలు చేయకపోవటంతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆ కేంద్రాల నెట్వర్క్ నెఫ్రో ప్లస్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు కరోనా బారిన పడితే మిగిలిన వారి మాదిరిగా హౌం ఐసోలేషన్ కుదరదు. తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సిందే. నెఫ్రో ప్లస్ చేసిన ఈ అధ్యయనాన్ని ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ జర్నల్, కిడ్నీ ఇంటర్నేషనల్ రిపోర్టులు ప్రచురించాయి. మొదటి వేవ్ లో 14,573 మంది డయాలసిస్ రోగులపై అధ్యయనం చేశారు. కోవిడ్-19 బారిన పడిన వారిలో 99 శాతం మంది ఆస్పత్రుల్లో సగటున 12 రోజులుండగా, వారిలో మరణాల రేటు 23 శాతంగా నమోదైంది. వీటికి తోడు డయాలసిస్ కేంద్రాలున్న ఆస్పత్రులు కోవిడ్ ఆస్పత్రులుగా మారటంతో రోగులు ఆస్పత్రులకు వచ్చేందుకు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో డయాలసిస్ జనాభాలో 2019లో 15 శాతం మంది, 2020లో 20 శాతం మంది మరణించారు. రెండో వేవ్ లో 17,662 మందిని పరీక్షించగా వారిలో 1,111 మంది (6.2 శాతం) కరోనా బారిన పడ్డారు. వీరిలో 32.76 శాతం మంది మరణించారు. ఈ శాతం మొదటి వేవ్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నది. కరోనా సోకిన వ్యక్తుల్లో 55 ఏండ్ల పైబడ్డ వారు 45 శాతం మంది ఉన్నారు. సాధారణ ప్రజల్లో కన్నా ఈ రోగుల్లో కోవిడ్ సోకటం 20 శాతం అధికంగా ఉందని, సాధారణ జనాభాలో సంక్రమణ శాతం 0.44 శాతముంటే డయాలసిస్ రోగుల్లో 8.7 శాతం ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది.
తెలుగు రాష్ట్రాల్లో.....
దేశవ్యాప్తంగా చేసిన సర్వేల్లో భాగంగా కోవిడ్ రెండు దశల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. మొదటి వేవ్లో ఆంధ్రప్రదేశ్ లో 542 మంది ఇన్ఫెక్షన్కు గురి కాగా అందులో 119 మంది, తెలంగాణలో 23 మందికి గాను 12 మంది మరణించారు. అదే క్రమంలో రెండో వేవ్ సమయంలో ఏపీలో 328 మంది ఇన్ఫెక్షన్కు గురి కాగా అందులో 112 మంది, తెలంగాణలో 41 మందికి గాను 13 మంది ప్రాణాలొదిలారు.
వ్యాక్సిన్ రక్షించింది.....
వ్యాక్సినేషన్ డయాలసిస్ రోగుల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని 33 శాతం తగ్గించిందని నెఫ్లో ప్లస్ సహ వ్యవస్థాపకులు కమల్ డి షా, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వివేకానంద్ ఝా తెలిపారు. టీకా తీసుకోకపోతే చనిపోయే ప్రమాదముందని గుర్తించాలని సూచించారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకినా మరణానికి ఉన్నఅవకాశాలను అది సగానికి తగ్గిస్తుందని తెలిపారు. రిస్క్ గ్రూపుల్లో భాగమైన డయాలసిస్ రోగులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.