Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలనీ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జరిగే భారత్బంద్కు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు కె చక్రధర్రావు, ప్రధాన కార్యదర్శి జి హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి కె లక్ష్మినారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ సర్కారు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ప్రజలకు అన్నం పెట్టే రైతు బతుకును విధ్వంసం చేయడానికి మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని తెలిపారు. వ్యవసాయ కార్పొరేటీకరణతో రైతు సొంత పొలంలో కూలీగా మారే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి నూతన విద్యావిధానం-2020ని తెచ్చిందని వివరించారు. విద్యాకార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి అమలు చేస్తుందని తెలిపారు. విద్యాసంస్థలన్నీ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బంద్లో విద్యాపరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.