Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7,700 మంది అబ్బాయిలు, 25,983 మంది అమ్మాయిలు అర్హత
- ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎడ్ రెండేండ్ల కోర్సులో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ రాతపరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఎడ్సెట్కు 42,399 మంది దరఖాస్తు చేయగా, గతనెల 24,25 తేదీల్లో ఆన్లైన్లో జరిగిన రాతపరీక్షలకు 34,185 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 33,683 (98.53 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో 7,737 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 7,700 (99.52 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 26,448 మంది పరీక్షలకు హాజరైతే 25,983 (98.24 శాతం) మంది అర్హత సంపాదించారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా దరఖాస్తు చేయడంతోపాటు ఉత్తీర్ణత పొందడం గమనార్హం. కనీస అర్హత మార్కుల్లేకపోవడంతో పరీక్షలు రాసిన ఎస్సీలు 4,770 మంది, ఎస్టీలు 7,868 మంది వందశాతం ఉత్తీర్ణత పొందారు. బీసీఏలో 3,270 (96.77 శాతం), బీసీ బీలో 6,145 (97.02 శాతం), బీసీ సీలో 208 (97.65 శాతం), బీసీ డీలో 6,064 (97.90 శాతం), బీసీఈలో 2,321 (96.95 శాతం), ఓసీల్లో 3,037 (98.22 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ష్ట్ర్్జూర://్రవసషవ్.్రషష్ట్రవ.aష.ఱఅ వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇంగ్లీష్, తెలుగు మీడియంకు 31,410 మంది పరీక్షలు రాస్తే, 31,004 (98.71 శాతం), ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో 2,775 మంది పరీక్ష రాయగా, 2,679 (96.54 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ 122.153 మార్కులతో నల్లగొండ జిల్లాకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్ టాపర్గా నిలిచారని చెప్పారు. మంచిర్యాలకు చెందిన అకెనపల్లి ప్రత్యూష రెండో ర్యాంకు, బీహార్కు చెందిన రిషికేశ్ కుమార్శర్మ మూడో ర్యాంకు, నారాయణపేట్కు చెందిన సమర సింహారెడ్డి నాలుగో ర్యాంకు, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిఖిల్ భమిడిపాటి ఐదో ర్యాంకు సాధించారని వివరించారు. ఎడ్సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ మాట్లాడుతూ అన్ని మెథడాలజీలకూ కామన్ ప్రశ్నాపత్రాన్ని రూపొందించి పరీక్ష నిర్వహించామన్నారు. దానివల్ల విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా డిగ్రీలో చదివిన సబ్జెక్టులను బట్టి మెథడాలజీ ఎంచుకునే అవకాశముందని అన్నారు.
ఓయూ వీసీ డి రవీందర్ మాట్లాడుతూ అమ్మాయిలు ఎక్కువ మంది ఉత్తీర్ణులు కావడం శుభపరిణామమని చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అమల్లోకి వచ్చాక బాల్యవివాహాలు జరగడం లేదనీ, ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెప్తున్నాయని వివరించారు. ఓయూ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్బాబు మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో 206 బీఎడ్ కాలేజీల్లో 18,150 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి ఎడ్సెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఎడ్సెట్ కో కన్వీనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.