Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్కు ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లనూ కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. డొనేషన్ల పేరుమీద ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్రెడ్డిని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు బీ కేటగిరి సీట్లను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీలను వ్యాపార కేంద్రాలు గా మారుస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 30 శాతానికిపైగా సీట్లను నోటిఫికేషన్ ఇవ్వకుండానే అమ్ముకున్నట్టు విమర్శలొస్తున్నాయని అన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్, ఓయూ, కేయూ పరిధిలోని కాలేజీలు ప్రతిభ కలిగిన విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ఇంజినీరింగ్ కాలేజీ సీట్లపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్రెడ్డి, జావేద్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పడలా శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, శంకర్, ఓయూ కార్యదర్శి రవి నాయక్, నాయకులు ఖాసిం పాల్గొన్నారు.