Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న నారాయణగూడ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ
- రైతు, వ్యకాస, కార్మిక, ప్రజాసంఘాల వెల్లడి...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్యమా, కార్పొరేట్ రాజ్యమా-తేల్చుకునేందుకే 27 భారత్ బంద్ నిర్వహిస్తున్నామనీ, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతుసంఘాలు, కార్మిక, వ్యవసాయ కార్మికసంఘాలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ విజయవంతం కోసం మోటార్ వాహనాలు, సైకిళ్ల ప్రదర్శనలు నిర్వహించాలనీ, కరపత్రాలతో విస్తృత ప్రచారం చేయాలని సూచించాయి. బంద్ రోజు హైదరాబాద్లో నారాయణగూడ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపాయి. శనివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయా సంఘాలకు చెందిన రాష్ట్ర నాయకులు టి సాగర్, పశ్యపద్మ, రాయలచంద్రశేఖర్, అచ్యుత రామారావు, వల్లపు ఉపేందర్రెడ్డి, కన్నెగంటిరవి, వేములపల్లి వెంకట్రామయ్య, జె వెంకటేష్, సూర్యం, ధర్మపాల్, ప్రేమ్పావని, బి ప్రసాద్, కాంతయ్య, ఎం అనిల్కుమార్, ప్రదీప్, పరుశురామ్, అన్వేష్రెడ్డి, శేఖర్రెడ్డి, రాము బోయిన్పల్లి, సలీం, బాబు మహాజన్ సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. భారత్బంద్కు దేశవ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయనీ, రాష్ట్రంలోనూ బీజేపీ, టీఆర్ఎస్యేతర పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులు దిగ్బంధించడంతోపాటు ప్రతి పట్టణం, జిల్లా, మండల కేంద్రాల్లో బంద్ విజయవంతం చేస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనీ, మద్దతు ధరల గ్యారెంటీచట్టం తేవాలనీ, విద్యుత్ బిల్లుల సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీటికి వ్యతిరేకంగా 10 నెలలగా కొనసాగుతన్న రైతు ఉద్యమాన్ని కేంద్రం అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బడా కార్పొరేట్లకు లబ్దిచేర్చేందుకు చట్టాలనే మార్చేయడం సరైందికాదని చెప్పారు. మోడీ తన మిత్రులైన అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం కృషిచేస్తున్నారని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో రైతాంగ ఉద్యమం అధికార పార్టీ నాయకులు, మంత్రులు సమావేశాలు నిర్వహించుకోలేని పరిస్థితిదాపురించిందన్నారు. దేశంలో 70 ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లను మోడీ సర్కారు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసీ, విశాఖ స్టీల్ వంటి లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసేందుకు పూనుకుందని విమర్శించారు. కార్మికవర్గం కార్పొరేట్ పెత్తనాన్ని అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈనేపథ్యంలో జరగనున్న భారత్బంద్కు కార్మిక, అసంఘటిత కార్మిక సంఘాలు, మహిళా, దళిత, బీసీ, మైనార్టీ, విద్యార్థి, యువజన, హైదరాబాద్లోని బస్తీ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు.