Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కావాలనే సమస్యలు సృష్టించారు
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ధరణి పోర్టల్ కచ్చితంగా ఓ కుట్ర అని పలు రాజకీయపార్టీల నేతలు విమర్శించారు. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన సంస్థ తన వివరాలను వెల్లడించొద్దనే షరతుతో దాన్ని రూపొందించిందన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో తయారు చేసిన సాఫ్ట్వేర్ లోపభూయిష్టమని ఆ సంస్థకు కూడా తెలుసనీ, అందువల్లే పేరును ప్రచారం చేసుకొనేందుకు ఇష్టపడట్లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి ప్రెస్క్లబ్లో 'ధరణి-సమస్యలు-పరిష్కారాలు' అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బి వేణుగోపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్థన్, తెలంగాణ జనసమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్ నర్సయ్య, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రారంభంలో ధరణి పోర్టల్ బాధితులు తమ గోడును వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధరణి పోర్టల్ను తయారు చేసిన సంస్థే తమ పేరును వెల్లడించొద్దని చెప్పిందంటేనే కుట్రకోణం స్పష్టమవుతున్నదని అన్నారు. ధరణి వచ్చాక సుమారు 20 లక్షల ఎకరాల పట్టా భూమి సెక్షన్ 22(ఏ) కింద నిషేధిత జాబితాలో పెట్టారనీ, దాదాపు 90వేల ఫిర్యాదులు దీనిపైనే వచ్చాయని చెప్పారు. పోర్టల్లో తమ భూముల వివరాలు లేవని 1.70 లక్షల దరఖాస్తులు రెవెన్యూ అధికారులకు వచ్చాయని తెలిపారు. మ్యూటేషన్ కోసం 2.5 లక్షల దరకాఖాస్తులు, ఏజీపీఏ, జీపీఏ ద్వారా 10వేల ఫిర్యాదులు, ఇతర సమస్యలపై 2లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని వివరించారు. ఎమ్మార్వో, ఆర్డీఓ స్థాయిలో పరిష్క రించగలిగే సమస్యల్ని కూడా కలెక్టర్లే చూడాలనే నిబంధన వల్ల రైతాంగం, ప్రజలు, రియల్టర్లు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు చెందిన 3 లక్షల ఎకరాల భూమిని 'శ్రీ' పేరుతో నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పారు. మ్యాన్యువల్ రికార్డులు రాయకుండా పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడితే భవిష్యత్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 10 లక్షల మందికి కొత్త పాస్బుక్స్ రావల్సి ఉన్నదనీ, సర్టిఫైడ్కాపీలు, ఈసీలు కూడా రావట్లేదన్నారు. గ్రామ సభలు పెట్టి సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించాలనీ, ఎమ్మార్వోలకు పరిమిత అధికారాలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్ సమన్వయకర్తగా వ్యవహరించారు.