Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో విద్యార్థి సంఘాల ర్యాలీ, మానవహారం
- రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, సన్నాహక సమావేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యా వ్యవస్థలో స్వదేశీ, విదేశీ కార్పొరేటీకరణను, ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల దోపిడీని ప్రతిఘటించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అదేవిధంగా రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీటికి నిరసనగా ఈనెల 27న చేపట్టే భారత్ బంద్లో అత్యధికంగా విద్యార్థులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ చట్టాలు, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై చేపట్టనున్న బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, అఖిలపక్ష పార్టీల సన్నాహక సమావేశాలు జరిగాయి. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు సహకరించాలని కోరుతూ నారాయణగూడలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ రెడ్డి, జావిద్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిల్, శ్యామ్, నాగేశ్వరరావు, పీడీఎస్యూ కార్యదర్శి గణేష్, నాగరాజు టీజేఎస్ పవన్, జీవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో విదేశీ కార్పొరేట్ విద్యాసంస్థల రాకతోనూ, ఇక్కడి కార్పొరేట్ సంస్థల దోపిడీతోనూ ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడుతున్నాయని, తద్వారా అట్టడుగు వర్గాల విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని ఉపసంహరించుకోవాలని, యూజీసీ, ఏఐసీటీఈ స్థానంలో ఉన్నత విద్యాకమిషన్ను తీసుకురావడం అంటే పరిశోధనా రంగానికి నిధుల కోత విధించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంఫిల్ వంటి కోర్సులను రద్దు చేయాలని ఈ ముసాయిదాలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ డిగ్రీ కోర్సు కాల వ్యవధి నాలుగేండ్లకు పెంచిందన్నారు. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు మధ్యలోనే డ్రాపవుట్లుగామిగిలే అవకాశం ఉందని, ఇటువంటి నిరుపయోగ సంస్కరణలు విద్యారంగానికి తీవ్ర నష్టం చేస్తాయని చెప్పారు.ప్రయిటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తూ.. మతోన్మాద భావజాలాన్ని పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు..27న జరిగే భారత్ బంద్కు విద్యాసంస్థలు సహకరించాలని యాజమాన్యాలను విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.