Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగైదు జిల్లాల్లోనే డబుల్ డిజిట్
- 0.40-0.50 శాతం మధ్యే కరోనా పాజిటివ్ రేటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత నెల రోజులకు పైగా రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు నాలుగైదు జిల్లాల్లో మాత్రం డబుల్ డిజిట్ గా నమోదు అవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో సంఖ్య రీత్యా 50-100 మధ్య ప్రతి రోజు కేసులు నమోదవుతున్నాయి. నారాయణపేటలో గత 15 రోజులకు పైగా ఒక్క కేసు రాలేదు. నిర్మల్, గద్వాల, కామారెడ్డి, వనపర్తి తదితర జిల్లాల్లో తరచూ కేసులు వెలుగు చూడకపోగా అడపదడపా ఒకట్రెండు బయటపడుతున్నాయి. మొత్తంగా ప్రతి రోజు కరోనా పాజిటివ్ రేటు 0.40 నుంచి 0.50 మధ్యే ఉంటుండటం గమనార్హం. కొన్ని జిల్లాల్లో మాత్రం ఒక్కో రోజు అకస్మాత్తుగా అంతకు ముందు రోజు కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తున్నా అది అప్పటికే పరిమితం కావటం తిరిగి తగ్గుముఖం పడుతుండటంతో పరిస్థితి ఆశాజనకంగా మారింది.
201 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 201 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,690 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 0.48 శాతంగా పాజిటివ్ రేటు నమోదైంది. ప్రభుత్వాస్పత్రుల్లో 35,273 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో4,541 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,408 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,541 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ములుగు, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
తొమ్మిది జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శుక్రవారంతో పోలిస్తే శనివారం జీహెచ్ఎంసీతో పాటు తొమ్మిది జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, కరీంనగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో పెరిగాయి.
16 జిల్లాల్లో తగ్గిన కరోనా
జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు తక్కువగా నమోదయ్యాయి.
16 రోజులుగా నారాయణపేటలో జీరో ....
నారాయణపేటలో గత 16 రోజులుగా, నిర్మల్లో ఐదు రోజులుగా,జోగు లాంబ గద్వాల లో రెండ్రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు.