Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతరిక్షంలో ఔషధాలు, వైద్యసామగ్రి తయారీ
- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొత్త మిషన్
- శక్తివంతమైన మందులు తేవడమే లక్ష్యం
(జై)
వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వైద్య పరికరాలు, ఔషధాలను అంతరిక్షంలో తయారుచేయడానికి శాస్త్రవేత్తలు కార్యోన్ముఖులయ్యారు. ఈ ప్రాజెక్టుకు 'రోదసీలో తయారీ'గా నామకరణం చేశారు. ఆ నేపథ్యంపై ప్రత్యేక కథనం..
ఏమిటీ ఈ ప్రాజెక్టు?
భూమి మీద ప్రయోగశాలల్లో తయారుచేసే వైద్య పరికరాలు, ఔషధాలు, వ్యాక్సిన్లను ఇకపై అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లలో తయారుచేస్తారు. దీనినే 'రోదసీలో తయారీ' ప్రాజెక్టు పేరుతో పిలుస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), బ్రిటన్కు చెందిన ప్రయివేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్ ఫోర్జ్'తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. రోదసీలో ల్యాబ్ల నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్ను సరఫరా చేసేందుకు ఫోర్జ్స్టార్ ఆర్బిటాల్ వేహికిల్ (ఎఫ్ఎస్వోవీ-1) అనే వ్యోమనౌకనూ సిద్ధం చేస్తున్నది. ఈ ప్రయోగం 2022లో ఉండనున్నది.
అంతరిక్షంలోనే ఎందుకు?
రోదసిలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉండవన్న విషయం తెలిసిందే. రోగాలను నయంచేసే ఔషధాలు, వ్యాక్సిన్లను అంతరిక్షంలోని స్వచ్ఛమైన పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తే వాటిపై సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో ఔషధాల పనితీరు, జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ఔషధ సామర్థ్యాన్ని కూడా ఇప్పటికంటే మరింతగా పెంచవచ్చు. ఇక, సున్నితమైన వైద్య పరికరాల తయారీలో వినియోగించే లోహాలను వివిధ సాంద్రతల్లో కలపాల్సి ఉంటుంది. అయితే, భూమి మీద ఉన్న పీడనం, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఆ ప్రక్రియకు చాలా సందర్భాల్లో అంతరాయం కలుగుతున్నది. దీంతో వైద్యపరికరాల తయారీ కంపెనీలకు కోట్లల్లో నష్టం వాటిల్లుతున్నది. దీంతో భూమితో పోలిస్తే 10 లక్షల కోట్ల రెట్లు తక్కువ పీడనం ఉండే రోదసిలో ఈ వైద్య పరికరాలను సులభంగా, మరింత శక్తివంతంగా తయారు చేయవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.