Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాశ్
- ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి
నవతెలంగాణ - హుజూరాబాద్
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ఓం ప్రకాష్.. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనీ నియమావళిని కఠినంగా అమలు చేస్తామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చును రోజువారీగా చూపెట్టాలని తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా పోటీలో ఉన్న అభ్యర్థులు పంపిణీ చేసే డబ్బు, మద్యం, బహుమతులపై దృష్టి సారిస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఉల్లంఘన జరిగినట్లు తెలిసిన ఎవరైనా తనకు సెల్ నెంబర్ 6281552166 ద్వారా సమాచారం అందించాలనీ, ప్రతి రోజు ఉదయం 9.30గంటల నుంచి 10.30గంటల వరకు కరీంనగర్లోని ఎక్సైజ్ భవన్ అతిథి గృహంలో సంప్రదించవచ్చని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన ఇదివరకే పూర్తిచేశామన్నారు. ప్రస్తుతం 732 బ్యాలెట్ యూనిట్లు, 703 కంట్రోల్ యూనిట్లు, 491వీవీ ప్యాట్ల నుంచి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన 427బ్యాలెట్ యూనిట్లు, 427 కంట్రోల్ యూనిట్లు, 458 వీవీ ప్యాట్లను హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తామని తెలిపారు. పసుపు పచ్చ రంగు స్టిక్కర్ వేసిన ఈవీఎంలను ఎన్నికల శిక్షణకు ఉపయోగిస్తామనీ, ఆకుపచ్చ రంగు స్టిక్కర్లు వేసిన ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగిస్తామన్నారు. 100 వీవీ ప్యాట్లను రిజర్వులో ఉంచుతామని తెలిపారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాష్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి హుజురాబాద్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం, హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, తదితరులు పాల్గొన్నారు.