Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది.మొత్తం తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. తొలిరోజు బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. సద్దుల బతుకమ్మతో తొమ్మిదో రోజు ఈనెల 14న ముగుస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుక మ్మ సంబురాలు జరుపుకుంటారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకతి పండుగ బతుకమ్మ, ప్రస్తుతం ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమని వివరించారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందని పేర్కొ న్నారు. బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో నిండి ఉన్నాయనీ,బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని అమ్మవారిని కేసీఆర్ ప్రార్థించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, టి హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.