Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 187 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 39,161 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 34,112 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,049 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,545 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,406 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 62 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఏడు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
నాలుగు జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో మంగళవారంతో పోలిస్తే బుధవారం నాలుగు జిల్లాల్లో కేసులు పెరిగాయి. జనగామ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ రూరల్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
18 జిల్లాల్లో తగ్గిన కేసులు
జీహెచ్ఎంసీతోపాటు ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, జయ శంకర్భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కా జిగిరి, ములుగు, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగా రెడ్డి, సూర్యాపేట,వనపర్తి, వరంగల్అర్బన్ జిల్లాల్లోతక్కువగా నమోద య్యాయి.
నిర్మల్లో తొమ్మిది రోజులుగా జీరో...
నిర్మల్ జిల్లాలో గత తొమ్మిది రోజులుగా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా, నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు రోజులుగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి రోజు ఒక్క కేసు మాత్రమే నమోదైంది. నిజామాబాద్ లో నాలుగు రోజులుగా, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మూడు రోజులుగా, మహబూబ్ నగర్ లో రెండు రోజులుగా ప్రతి రోజు ఇద్దరు చొప్పున వ్యాధి బారిన పడ్డారు.