Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 176 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,857 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 32,627 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,230 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,543 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,365యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 53 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా 10 జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
13 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో బుధవారంతో పోలిస్తే గురువారం 13 జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
15 జిల్లాల్లో తగ్గిన కేసులు
జీహెచ్ఎంసీతో పాటు ఆదిలాబాద్, జనగామ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, నల్లగొండ, పెద్దపల్లి, వరంగల్ రూరల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో ఎనిమిది రోజులుగా
వికారాబాద్ జిల్లాలో గత ఎనిమిది రోజులుగా, నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు రోజులుగా ప్రతి ఒక్క కేసు మాత్రమే నమోదవుతున్నది. కొమురంభీ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజులుగా, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో రెండు రోజులుగా ఒక్క కేసు లేదు.