Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడిన కార్మికులు
- నడిపేందుకు ముందుకు రాని యాజమాన్యం
- ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించని ప్రభుత్వం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 1975లో నిర్మితమైన ఏపీ రేయాన్స్(బిల్ట్) ఫ్యాక్టరీ ఇక చరిత్రకే పరిమితం కానుంది. 1980లో ఉత్పత్తిని ప్రారంభించిన ఈ పరిశ్రమ 2014లో మూతపడింది. పరిశ్రమను పునరుద్ధరించడానికి ప్రభుత్వం రాయితీలు ప్రకటించినా నడిపేందుకు 'బిల్ట్' యాజమాన్యం ముందుకు రాకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉమ్మడి వరంగల్ ఏకైక పెద్ద పరిశ్రమ పునరుద్ధరణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
పరిశ్రమలో ఏటా ఉత్పత్తి అయ్యే 90 వేల టన్నుల కాగితపు గుజ్జును గ్రాసీమ్ కంపెనీ కొనుగోలు చేసేది. కానీ, గ్రాసిమ్ కంపెనీ సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకోవడంతో 2014 నుంచి 'బిల్ట్' కాగితపు గుజ్జు కొనుగోళ్లను ఇక్కడి నుంచి నిలిపేసింది. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 6న బిల్ట్ మూతపడింది. ఈ క్రమంలో 2015 మార్చి 9 నుంచి 2016 మార్చి 6 వరకు కార్మికులు ఏడాదిపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పరిశ్రమను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించినా యాజమాన్యం నేటికీ ముందుకు రాలేదు. ఐడీబీఐ నుంచి తీసుకున్న రూ.5 వేల కోట్ల రుణాన్ని చెల్లించకపోవడంతో యాజమాన్యానికి బ్యాంకు నోటీసు జారీ చేసింది. పరిశ్రమను తెరవాలని గత సెప్టెంబర్లో పలువురు కార్మికులు కమలాపూర్ నుంచి ప్రగతిభవన్కు పాదయాత్ర ప్రారంభించగా, ములుగులో పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్లో ఆజంజాహి మిల్లు మూతపడిన దిశలోనే బిల్ట్ మూతపడటంతో జిల్లాలో పెద్ద పరిశ్రమలు కరువయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ థాపర్ నేతృత్వంలోని అవంతి బిల్ట్ గ్రూపుతో చర్చించి.. జరిగిన ఒప్పందం మేరకు పలు సబ్సిడీలను ప్రకటించి జీఓఎంఎస్ నెంబర్ 91ని జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం ఏటా రూ.30 కోట్ల చొప్పున ఏడేండ్లపాటు రూ.210 కోట్లను రాయితీల రూపంగా ఇవ్వడానికి నిర్ణయించింది. అలాగే ఏటా రూ.9 కోట్ల విద్యుత్ సబ్సిడీతోపాటు 4 లక్షల మెట్రిక్ టన్నుల నీలగిరి కలపను ఐదేండ్లపాటు అందించడానికి, ఇతర పన్నుల్లో సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఏపీలో లభించే నీలగిరి కలపను సబ్సిడీపై పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపిన విషయం విదితమే. అయినా పరిశ్రమను నడపడానికి యాజమాన్యం ముందుకు రాలేదు. దీంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
గతమెంతో ఘనం
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపూర్లో ప్రభుత్వం 1975లో ఏపీ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. 610 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 1980 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. ఏటా 90 వేల మెట్రిక్ టన్నుల కాగితపు గుజ్జు ఉత్పత్తి అయ్యేది. ఈ కాలంలో పరిశ్రమలో సుమారు వెయ్యి మంది పర్మినెంట్ ఉద్యోగులు, 10 వేల మంది తాత్కాలిక, రోజువారీ వేతన కార్మికులు పని చేసేవారు. అనేక మందికి ఉపాధి చూపిన పరిశ్రమ 2014 ఏప్రిల్ 6న మూతపడటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇప్పటి వరకు 36 మంది ఉద్యోగులు మృతిచెందారు. ఎప్పటికైనా పరిశ్రమ తెరుచుకుంటుందని కండ్లు కాయలు కాసేలా కార్మికులు ఎదురు చూస్తున్నారు.
మార్కెటింగ్లోనే సమస్యలు..
బిల్ట్ పరిశ్రమలో ఉత్పత్తయ్యే రేయాన్ గ్రేడ్ పల్ప్, విస్కోస్ స్టాపుల్ ఫైబర్ను గ్రాసిమ్ కంపెనీ కొనుగోలు చేసేది. చివరకు గ్రాసిమ్ కంపెనీ సొంతంగా రేయాన్ పల్ప్ పరిశ్రమను నెలకొల్పడంతో ఇక్కడి నుంచి సరుకును కొనుగోలు చేయడం బంద్ చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన సంక్షోభం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ను చూసుకోవడంలో బిల్ట్ యాజమాన్యం విఫలమైంది. పరిశ్రమలో ఉత్పత్తి పేరుకుపోయింది. దీంతో పరిశ్రమను యాజమాన్యం 2014 ఏప్రిల్ 6న మూసేసింది. అప్పటి నుంచి కార్మికులు ఏదో ఒక రూపంలో పోరాడుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించడం లేదు.