Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరి మరణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 183 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు .ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 40,354 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 36,652 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,196 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,517 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,196 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 53 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఐదు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
18 జిల్లాల్లో పెరిగిన కేసులు : రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం 18 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
10 జిల్లాల్లో తగ్గిన కేసులు : జీహెచ్ఎంసీతో పాటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. నారాయణపేటలో ఆరు రోజులుగా జీరో : నారాయణపేట జిల్లాలో ఆరు రోజులుగా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. మేడ్చల్ - మల్కాజిగిరి, వనపర్తి జిల్లాల్లో రెండు రోజులుగా కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.