Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గొర్ల ఇద్రారెడ్డి మరణం రైతాంగ ఉద్యమానికి తీరని లోటని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి జంగారెడ్డి, టి సాగర్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఇంద్రారెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. తరుగు పేరుతోపాటు, తూకంలో జరుగుతున్న మోసాలపై రైతుల తరుపున నిలబడి పోరాడారని గుర్తుచేశారు. విద్యార్థి ఉద్యమం నుంచే ప్రగతిశీల బాటపట్టారని వివరించారు. నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారం కోసం తపించే ఇంద్రారెడ్డి మరణించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవినాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.