Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీటిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడరు...?
- వ్యక్తిగత దూషణ, భాషణలతో లాభమేంటి...?
- మీ తీరు మార్చుకోండి
- రేవంత్కు మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాసగౌడ్ సూచన
- పాలమూరు వెనుకబాటుకు పురుడు పోసింది కాంగ్రెస్సేనని విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయం, విద్యుత్, సాగునీటి పారుదల రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు తెలంగాణకు తీవ్ర నష్టాన్ని కలిగించనున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ వీటిపై పోరాడాలని ఆయన సూచించారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వీటిపై నోరిప్పాలని కోరారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్పైనా నిరాధార, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేయటం సరికాదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి వి.శ్రీనివాసగౌడ్, ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ పేరిట మహబూబ్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పరుష పదజాలంతో సీఎంపై నిందారోపణలు చేయటం శోచనీయమన్నారు. కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించినప్పటికీ ఆ పార్టీ నేతల తీరు మారటం లేదని అన్నారు. పాలమూరు వెనుకబాటు తనానికి పురుడు పోసింది, పునాదులేసింది ఆ పార్టీయేనని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల విధానాల వల్ల పాలమూరు వెనుకబడిందంటూ ఇదే కాంగ్రెస్ నేతలు గతంలో శ్రీకృష్ణ కమిటీకి నివేదికనిచ్చింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఆ జిల్లాకు సాగునీరిచ్చే జూరాల ప్రాజెక్టును పూర్తి చేయటానికి కాంగ్రెస్కు 36 ఏండ్లు పట్టిందని అన్నారు. కర్నాటకకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంతోనే ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నిర్మాణంలో కాలయాపన చేశారని చెప్పారు. అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్... కాంగ్రెస్ వల్లే పాలమూరుకు నీరందటం లేదంటూ విమర్శించారని గుర్తు చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై 190 కేసులు వేసింది కాంగ్రెస్ వాళ్లేకదా..? అని ప్రశ్నించారు. నాగం జనార్థన్రెడ్డి వేసిన కేసు ఇప్పటికీ సుప్రీం కోర్టులో కొనసాగుతున్నదని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలకు దిగుతున్నా... ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కక్షపూరితంగా వారిద్దరూ ఏనాడూ కేసులు వేయలేదని చెప్పారు.
ఇక్కడి కాంగ్రెస్ నేతల పుట్టుక తెలంగాణది... కానీ వారిలో ఆ పౌరుషం లేదని నిరంజన్రెడ్డి విమర్శించారు. శ్రీకాంతాచారి ఫొటో పట్టుకుని తిరిగే నైతిక అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ... పాలమూరు పచ్చబడుతుంటే హస్తం పార్టీ నేతల కండ్లు ఎర్రబడుతున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో మాదిరిగా ఉద్యోగాలిచ్చారా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల భవిష్యత్కు తమ ప్రభుత్వం హామీనిస్తుందని తెలిపారు.