Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ చేసుకునేదెట్ట.. సామాన్యుల ఆవేదన
- ఆయిల్ ధరల పెంపుతో నడ్డివిరిచిన బీజేపీ ప్రభుత్వం
- అమాంతం పెరిగిన నిత్యావసర ధరలు
- బతుకమ్మలకు కష్టంగానే పూల సేకరణ
- పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే కొనుగోళ్లు
- అమ్మకాలు లేక చిన్న వ్యాపారుల ఆందోళన
నవతెలంగాణ- మొఫుసిల్ యంత్రాంగం
తెలంగాణ అంతటా ఎంతో అట్టహాసంగా జరుపుకునే పండుగ ''దసరా, బతుకమ్మ''. ఈ పండుగ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే ఎక్కడ చూసినా సందడి ఉండేది.. కానీ ప్రస్తుతం అన్నింటా పెరిగిన ధరలతో ప్రజలు వణికిపోతున్నారు. ఏ వస్తువు ధర చూసినా సామాన్యులు కొనేందుకు వెనుకాముందు ఆడాల్సి వచ్చింది. ఏడాదిన్నరగా కోవిడ్-19 నేపథ్యంలో ఉపాధి లేక బతుకుడే కష్టతరమైంది. పండగుల సందడే కరువైంది. ఈ ఏడాది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో మరింత విపత్కర పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఈసారీ పండుగ పూట ఆనందంగా ఉండేందుకు అవకా శం లేకుండా పోయింది. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తు న్నాయి. దీంతో రవాణ ఖర్చులు పెరగడంతో దాదాపు అన్ని వస్తువుల ధరలూ అమాంతం పెరిగాయి. నిత్యావసరాల నుంచి పండుగకు కొనుక్కునే కొత్త బట్టల వరకూ ప్రతిదీ అందకుండా ఉంది. ఓ వైపు కోవిడ్తో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఉపాధికి దూరమైన పేద, మధ్యతరగతి ప్రజానీకం.. ఈ పండుగలను ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతోంది. మోడీ సర్కారు నిత్యావసర ధరలపై నియంత్రణ ఎత్తేయడంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. వంటనూనె లీటర్ రూ.145 నుంచి 160 పలు కుతోంది. బెల్లం 40 నుంచి 60 రూపాయలైంది. పంచదార రూ.38 నుంచి 45కు పెరిగింది. పప్పుల ధరలన్నీ 110-130 మధ్య ఉన్నాయి. పల్లీలు 108 నుంచి 120కి పెరిగింది. సబ్బుల రేట్లు పెరిగాయి. గిన్నెలు తోముకునే సబ్బుల రేట్లూ పెరిగాయి. నాన్వెజ్ ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ఈ యేడాది ఆశించిన కొనుగోళ్లు లేక చిన్న వ్యాపారులు ఆందోళనగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ధరలపై రాష్ట్రవ్యాప్తంగా 'నవతెలంగాణ' పరిశీలించగా.. సామాన్యులు, నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతం.
కూర 'గాయాలు'..!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా ఉన్నాయి. వారం రోజుల కిందట ఉన్న ధరలకు.. ప్రస్తుతానికి రెండింతలు ధరలు పెరిగాయి. రూ.200 తీసుకుని మార్కెట్కు వెళితే వారానికి సరిపడే కూరగాయలు రావడం లేదు. అర కిలో కంటే తక్కువే కానీ ఎక్కువ అసలు తీసుకోవడం లేదు. ఆకు కూరలు తామేమీ తక్కువ కాదన్నట్టుగా వాటి ధరలు కూడా అదే దారిలో.. నాలుగు కట్టలు కొనాలంటే రూ.20పైనే ఉంది. వారం రోజుల కిందట టమాట ధర కిలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60కి చేరింది. వంకాయ రూ.60 నుంచి రూ.80కి చేరింది. బెండకాయ, కాకకకాయ, బీరకాయ రూ.60, చిక్కుడు, క్యాప్సికమ్ రూ.80 అయింది.
మందగించిన వ్యాపారం
కరోనా నేపథ్యంలో వస్త్ర వ్యాపారం కూడా మందగించింది. అందులోనూ పెరిగిన నిత్యావసర ధరలు సామాన్య కుటుంబంపై భారం కాగా.. ఈ ఏడాది కొత్త వస్త్రాలు కొనుగోలు పట్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు వస్త్ర వ్యాపారుల అంచనా ప్రకారం చిన్న మధ్య తరహా దుకాణాల్లోనే ప్రతియేటా సుమారు రూ.2వేల కోట్ల వరకు వ్యాపారం సాగేది. ఈసారి కనీసంగా 30 శాతం మార్కెట్ పడిపోయినట్టు ప్రధాన వస్త్ర వ్యాపారి రాజేంద్ర శర్మ తెలిపారు. ఈ ఏడాది కాలంలోనే గతంతో పోలిస్తే 30 శాతం విక్రయాలు కూడా జరగలేదని హోండా షోరూం నిర్వాహకులు తెలిపారు. వరి సాగు విషయంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర పెడుతున్న మెలికల ఈ నేపథ్యంలో కొత్తగా హార్వెస్టర్లు కొనేందుకు రైతులు ముందుకు రావడం లేదు. కరీంనగర్ జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం ముగిసేనాటికి కనీసంగా 50 మేర హార్వెస్టర్లు అమ్ముడు పోయేవి. ఈసారి పది కూడా అమ్ముడు పోలేదని ప్రధాన కంపెనీ నిర్వాహకులు వెంకటేశ్వర్లు తెలిపారు.
అదుపులేని గ్యాస్, పెట్రోల్..
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి.. గ్యాస్ రూ.950కిపైగా ఉంది. దానికి గ్యాస్ డెలివరీ వారు తీసుకునేది అదనం. పెట్రోల్ లీటర్ రూ.108.63, డీజిల్ లీటర్ రూ.101.63 అయింది.
ఆనందంగా గడిపే రోజులు పోయాయి : మిట్టపెల్లి రవి- పంక్చర్ దుకాణం నిర్వాహకుడు- గాగీల్లపూర్
ప్రభుత్వాలు నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడం లేదు. అన్నింటా రేట్లు విపరీతంగా పెరిగాయి. పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే పరిస్థితులు లేవు. కనీసం పిల్లల కోసం పిండి వంటలు చేసుకోవడానికి వీలులేని దుస్థితి.
పూలు దొరకడం లేదు : బిగుల్ల స్వామి- పూల వ్యాపారి- కల్లేపల్లి
రెండేండ్లుగా బతుకమ్మ పండుగను ఎవరూ సరిగా జరుపుకోలేదు. ఈసారి జరుపుకోవాలనుకున్నా.. భారీ వర్షాలకు పూల చెట్లు ఎక్కువగా ఎదగలేదు. దీంతో పూలు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కిలో బంతి, చామంతి రూ.120 అమ్ముతున్నాం. పండుగ సందర్భంగా రూ.200 వెచ్చించినా పూలు దొరికే పరిస్థితి లేదు. గిరాకీ ఉన్నా లాభం లేదు.
వాహనం నడపలేని పరిస్థితి : నేళ్ల స్వామి, యాపల్గూడ, ఆదిలాబాద్ గ్రామీణం
పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉండటం వల్ల వాహనం నడపలేని పరిస్థితి ఏర్పడింది. లీటరుకు రూ.వందకు పైగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బండి బయ టకు తీస్తున్నాను.
ఎక్కువసార్లు ఆటోలు,బస్సుల్లోనే వెళ్తున్నా. అటు వ్యవసాయానికి ట్రాక్టర్, ఆయిల్ ఇంజిన్ వినియో గించాలన్నా ఇబ్బందులే. వీటితో పాటు నిత్యావసర ధరలు ఆకాశన్నంటడటంతో మార్కెట్లో ఏంకొనే పరిస్థితి లేదు.
కూరగాయల ధరలు వింటేనే భయమేస్తోంది : జ్యోతి, గృహిణి- నల్లగొండ
కూరగాయల ధరలు వింటేనే భయమేస్తోంది. రూ.100 కూరగాయలు కొంటే నలుగురున్న ఇంట్లో ఒక్క రోజుకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. పండుగ పేరుతో ఈ వారం రోజుల్లో మరింత పెరిగాయి. ఇదే పరిస్థితి ఉంటే కారం, చింతపులుసు, పచ్చళ్లతో పూట గడపాల్సి వస్తదేమో.
పూల ధరలు..
పప్పుల ధరలు జులై నెల ధర ప్రస్తుత ధర
శనగపప్పు రూ. 60 కిలో రూ.80 కిలో
కందిపప్పు రూ. 85 కిలో రూ.110 కిలో
పెసర పప్పు రూ. 60 కిలో రూ.100 కిలో
ఉల్లిగడ్డ రూ.10 కిలో రూ.35 కిలో
పల్లినూనె రూ.95 కిలో రూ.170 కిలో
బంతిపూలు కిలో రూ. 100 నుంచి 150
చామంతి కిలో రూ. 250
గునగ పువ్వు కట్ట రూ. 25
తంగేడు కట్ట రూ.20
మెరుగుడు పువ్వు కట్ట రూ. 30
గులాబీ కట్ట 50 గ్రాములకు రూ.30
రైతు కుటుంబాల్లో..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దసరా ఉత్సవాలపై ప్రజలు ఆసక్తి చూప డంలేదు. ఈఏడాది అధిక వర్షాల వల్ల పంటల దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొందరు రైతులు పత్తి, వేరుశనగ పంటలను చెడగొట్టి ఇతర పం టలకు సిద్ధమౌతున్నారు. దీనికితోడు నిత్యావసర వస్తువులధరలు అమాంతం పెరగడంతో రైతుల కుటుంబాల్లో పండుగ సందడి కనిపించడం లేదు.
పూలధరలకు అంతే లేదు..
బతుకమ్మ పూలకు కూడా ధరలు అడిగేట్టుగా లేదు. అకాల వర్షాల కారణంగా బంతి పూలు, చామంతి తదితర పూల తోటలు ధ్వంసమయ్యాయి. బతుకమ్మ పండుగకు ప్రజలు పూల కోసం మార్క్లెకు వెళ్తే ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. పూల దిగుబడి తగ్గినందున ఇతర ప్రాంతాల నుంచి పూలు కొనుక్కొస్తున్న మధ్యవర్తులు, వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.