Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 మంది అరెస్టు
- కుమ్మక్కైన బ్యాంకు అధికారులు,రెవెన్యూ సిబ్బంది, దళారులు
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ జిల్లాలో కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి అదనపు ఎస్పీ నర్మద గురువారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 2018 మే నెలలో రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4,000 చొప్పున అందించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. రైతు బంధు పథకంలో నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు, పెద్ద అడిశర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, చండూర్ మండలాల పరిధిలో రైతులకు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత చనిపోయిన వారి పేర్ల మీద, భూమి వివరాలు తప్పుగా పడిన వారి పేర్ల మీద, ఇతర ప్రాంతాల్లో ఉంటూ చెక్కులు తీసుకోని రైతుల పేరుతో వచ్చిన చెక్కులను కొందరు రెవెన్యూ అధికారులు, మధ్య దళారులు, బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా 547 చెక్కుల ద్వారా రూ.61,50,460 నగదును డ్రా చేసి రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో విచారణ జరిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐదు మండలాల పరిధిలో ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేసి 23 మందిని రిమాండ్కు తరలించినట్టు వివరించారు. నిందితులకు నాంపల్లి ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ రమావత్ రవి నాయక్ పూర్తిగా సహకరించారని ఏఎస్పీ తెలిపారు. కేసు విచారణలో సమర్ధవంతంగా పని చేసిన దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, మల్లేపల్లి సీఐ రవీందర్, నాంపల్లి సీఐ సత్యం, చండూర్ సీఐ మధు, గుర్రంపోడు ఎస్ఐ శీనయ్య, గుడిపల్లి ఎస్ఐ వీరబాబు, నాంపల్లి ఎస్ఐ రఫీ, చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.