Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ శాఖలో 43 మంది అవినీతి అధికారులపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు గురువారం నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారులు, సిబ్బంది. భాదితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఏలు నగదు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు నివేదికలో వెల్లడించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. దరఖాస్తు చేసుకుని డబ్బులు మంజూరయ్యే దాకా దళారుల మధ్యవర్తిత్వంతో దశలవారీగా ఒక్కో లబ్దిదారుని నుంచి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్టు తేల్చారు. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో 43 మంది రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. వారిలో వీఆర్ఏలు, వీఆర్వోలు, ఎమ్ఆర్ఐలు, ఆర్ఐలతోపాటు డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్ స్థాయి అధికారులు ఉన్నారు. అలాగే వీరికి సర్పంచ్ లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మీ సేవ సెంటర్లలో పని చేసే సిబ్బంది దళారులుగా వ్యవహరించినట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల సమగ్ర రిపోర్ట్ అందజేశారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్లను ప్రొసీడ్ చేయడంలో భాగంగా ఆదిలాబాద్ ఆర్డీఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నదీం రూ.86,09,976 దుర్వినియోగానికి పాల్పడినట్టు గతేడాది గుర్తించిన విషయం విదితమే. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఆ రెండు పథకాల అమలుపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.