Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తవారికి ఇండ్లు ఇవ్వాలని.. కేటాయించిన వారిని బయటికి పంపే యత్నం?
- ఆందోళనలో ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసముంటున్న ఏటిగడ్డకిష్టాపూర్ వాసులు
- సడెన్గా ఇండ్లు ఖాళీ చేయాలంటే ఎక్కడికి పోవాలి : భూ నిర్వాసితులు
నవతెలంగాణ-తొగుట
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్లో 14 గ్రామాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ముంపు గ్రామాల ప్రజలను ముట్రాజ్పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రభుత్వం తరలించింది. కాగా ముంపుగ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన కొంతమంది.. ఇంటి విషయంలో తమకు తక్కువగా పరిహారం ఇచ్చారనీ, అలాగే భూములకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికి దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే కోర్టునాశ్రయించిన వారు అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకోలేదు. గ్రామానికి చెందిన మిగతావారికి ఆర్అండ్ఆర్ కాలనీలోని ఇండ్లు అధికారులు కేటాయించారు. కాగా కోర్టుకు వెళ్లిన వారు ప్రస్తుతం ఇండ్లు కావాలని అడగడంతో.. ఇదివరికే ఇండ్లు కేటాయించిన 45 మందిని ఇప్పుడు ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయమై సర్పంచ్ ప్రతాప్రెడ్డిని గురువారం బాధితులు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
ఆ ఇండ్లకు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించుకున్నామని వాపోయారు. ఇండ్లు కేటాయించిన సమయంలో విద్యుత్ మీటర్ల కోసం రూ.6లక్షల పెట్టి డీడీలు కూడా తీశామన్నారు. ఇప్పటికే సొంత భూములు ప్రాజెక్ట్లో పోయి ఆందోళన చెందుతున్న తమను.. కేటాయించిన ఇండ్ల నుంచి కూడా వెళ్లగొట్టడం ఎంతవరకు సమంజమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్వాసితులు ఎవ్వరూ ఆందోళనకు గురికావద్దనీ, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఏ ఆపద వచ్చినా వారివెంట తాను ఉంటానని హామీ ఇచ్చారు.