Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ తర్వాత జోరందుకోనున్న ప్రచారం
- 30న పోలింగ్.. బరిలో 30 మంది..
- వ్యక్తిగత దూషణలు, సవాళ్లు..ప్రతిసవాళ్ల మధ్యనే ప్రచారం
- నియోజకవర్గానికి ఏ చేస్తామో చెప్పని ప్రధాన పార్టీలు
- పండుగ తరువాతే ప్రచారానికి 'హస్తం' ప్రణాళిక
- రెండు రోజులుగా తాయిలాలకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు
- ఏరులైపారుతున్న మద్యం, నగదు
- ఇప్పటివరకు అధికారులు పట్టుకుంది రూ.1.45 కోట్ల నగదు
రూ.5.11లక్షల విలువజేసే 867 లీటర్ల మద్యం సీజ్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు వారాలే మిగిలింది. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ ముగిసిన తరువాత 30న జరిగే పోలింగ్కు 30 మంది బరిలో నిలిచారు. బుజ్జగింపుల పర్వం, రెబల్స్ బెడద వంటి బాధలు ఈ ఉప ఎన్నికల్లో ఏ ప్రధానపార్టీకీ లేదు. ఉన్నదల్లా ఈ రెండు వారాల్లో ఓటర్లను ఆకర్షించే తాయిలాల అందజేతపైనే దృష్టిసారించే పనిలో పడ్డాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుండగా.. ఓటుకు నోటు పంచేందుకు ఇప్పటికే నగదు ఆయా బాధ్యులకు చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు, ఇతర అధికారులు ఇప్పటివరకు ఏకంగా రూ.కోటీ 45లక్షల నగదును పట్టుకోగా, రూ.5.11లక్షల విలువజేసే 867 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో పోటీచేస్తున్న ఆయా పార్టీలు ప్రధానంగా వ్యక్తిగత దూషణలు, వారి ఆస్తిపాస్తుల లెక్కలపైనే ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఎక్కడా ప్రజా సమస్యలు ఏజెండాగా ఏ పార్టీ అభ్యర్థి కూడా ప్రస్తావించడం లేదు. నియోజకవర్గ ప్రజల అవసరాలు, ఇప్పటివరకు చేసిన పనులు, చేయబోయే పనుల హామీల వంటి మాటలు ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే ఇన్నేండ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న 'ఈటల' చేసిందేమీ లేదనీ, 'గెల్లు'ను గెలిపిస్తే ప్రభుత్వమే ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేస్తుందని మంత్రి హరీశ్రావు మొదలు, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో 'ఇన్నేండ్లు 'ఈటల' ఉంది మీ పార్టీలోనే కదా! ఆయన పార్టీమారగానే అభివృద్ధి గుర్తుకు వచ్చిందా?' అని ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రోడ్లు, ఇతర సౌకర్యాలపై 'ఈటల' చేసింది శూన్యమని చెబుతున్న అధికారపార్టీ ఆ పనులు పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వానికే అవకాశం ఇవ్వాలని కోరుతుంది. సం'క్షేమం' ఆలోచించే టీఆర్ఎస్ కావాలా? ధరలు పెంచి జనం నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ కావాలా? అంటూ సవాళ్లు విసురుతోంది. అయితే ఆ ధరల పెరుగుదలలో కేంద్రమే పన్నులు బాదుతుందని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే భారాలు మోపుతుందని విపక్షాలు మాట్లాడుతున్నాయి.
పండుగ తర్వాత తాయిలాల జోరు
బతుకమ్మ పండుగకు ముందు వరకూ ప్రచార హౌరులో మునిగితేలిన ప్రధాన పార్టీల అభ్యర్థులు దసరా తర్వాత తాయిలాలకు తెరలేపనున్నారు. కులసంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల వారీగా ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, నగదు పంపిణీకి సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం అవసరమైన మద్యం, డబ్బు నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా చేరాల్సిన చోటుకు చేరాయనే ప్రచారం సాగుతోంది. ఇదే క్రమంలో పోలీసులు పట్టుకున్న నగదును పరిశీలిస్తే పెద్దఎత్తునే ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనల్లో ఆయా పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి హుజూరాబాద్ సరిహద్దుల్లో పెట్టిన చెక్పోస్టులు, ఆయా పట్టణాలు, మండల కేంద్రాలు, ఇతర గ్రామ సరిహద్దుల్లో చేస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు రూ.కోటీ 45లక్షలా 20వేలా 727 నగదును పోలీసులు పట్టుకున్నారు. రూ.1.50లక్షల విలువజేసే బంగారం, రూ.9లక్షల విలువజేసే వెండి, రూ.5.11లక్షల విలువజేసే 867లీటర్ల మద్యం, రూ.2లక్షలా 21వేల విలువజేసే చీరెలు, 50 షర్టులను స్వాధీనం చేసుకున్నారు.