Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 92 ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల పూర్తి
- వేగంగా కలెక్టరేట్ల పనులు
- జాతీయ రహదారులు పెరిగాయి
- రీజినల్ రింగ్ రోడ్డుకు డీపీఆర్ రెడీ చేస్తున్నాం
- కొత్త ప్రాజెక్టులతో ప్రమాదాలు తగ్గుతాయి : నవతెలంగాణతో ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి
''కొత్త సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం..వచ్చే దసరా కల్లా పూర్తి ..ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు..12 కలెక్టరేట్లు కొలిక్కి..శాసనసభ్యుల క్యాంపుల ఆఫీసులు వేగంగా కడుతున్నాం..జాతీయ రహదారులు పెరిగాయి..రిజినల్ రింగ్రోడ్డు పనులకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నాం..హైదరాబాద్- విజయవాడ రహదారి ఆరు లేన్లుగా విస్తరణ..నిధులు సైతం వచ్చాయి..హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న కొత్త ప్రాజెక్టులతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు..రోడ్డు ప్రమాదాలూ తగ్గుతాయి..కలెక్టరేట్లు, నర్సింగ్, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సైతం కడుతూ తిరిక లేకుండా ఉన్నామని' రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ కార్యకలాపాలపై నవతెలంగాణ ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న: ఆర్ అండ్ బీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి ?
జవాబు: రోడ్లు, భవనాల శాఖ క్షణం తీరికలేని పనులతో బీజీగా ఉంది. అనేక ప్రాజెక్టులు చేపట్టాం. ప్రతిష్టాత్మకంగా కొత్త సచివాలయాన్ని కడుతు న్నాం.కలెక్టరేట్లు, నర్సింగ్, మెడికల్ కాలేజీలు, జాతీయ రహదారుల పనులు, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసు పనులు నడుస్తున్నాయి. చిన్నా, చితకావి ఇంకా చాలానే ఉన్నాయి.
కలెక్టరేట్ల నిర్మాణం సుదీర్ఘంగా ఎందుకు సాగుతున్నది ?
ఏ ప్రాజెక్టును అయినా సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయడానికే ప్రయత్నిస్తాం. కలెక్టరేట్ల నిర్మాణం విషయంలో భూసేకరణ జరగాలి. దానికి కొంత సమయం పడుతుంది. అది జరిగాకే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభిస్తాం. ఇప్పటివరకు 12 కలెక్టరేట్లు నిర్మించాం. మరో 13 భవనాల పనులు నడుస్తున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, నారాయణ్పేట, వరంగల్ కలెక్టరేట్ల నిర్మాణ ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. సైట్ను బట్టి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. డిజైన్ దాదాపు అన్నింటికి ఒకటే. వీటి నిర్మాణానికి సర్కారు రూ.1365 కోట్లను కేటాయించింది.
ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల మాటేమిటీ ?
119 నియోజకవర్గాలకుగాను 104 చోట్ల క్యాంపు ఆఫీసుల నిర్మాణం చేపట్టాం. 92 భవనాలు పూర్తి చేశాం. తుంగతుర్తి, గద్వాల, షాద్నగర్, మల్కాజ్గిరి, కరీంనగర్, వరంగల్ ఈస్ట్ ఆఫీసుల పనులు నడుస్తున్నాయి. ఒక్కో భవనానికి రూ. కోటి మేర సర్కారు నిధులిచ్చింది.
గత మార్చి నాటికే క్యాంప్ ఆఫీసుల నిర్మాణం పూర్తి కావాలని సీఎం చెప్పారు కదా ?
పెద్దపల్లి, బాల్కొండ నియోజకవర్గ క్యాంపు ఆఫీసులు టెండర్లు పిలిచాం. నాగార్జునసాగర్, కూకట్పల్లి ప్రతిపాదనల దశలో ఉన్నాయి. జనగామ, ఎల్బినగర్ ఆఫీసులకు సంబంధించి స్థలాల ఎంపిక ఇంకా జరగలేదు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తిచేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నాం.
కొత్త సచివాలయం ప్రస్తుతం ఏ దశలో ఉంది ? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ?
నూతన సచివాలయాన్ని అత్యంత ప్రాధాన్యత క్రమంలో ప్రతిష్టాత్మకంగా పనులు చేపడుతున్నాం. దీనిపై నిరంతరం సీఎం పర్యవేక్షణ చేస్తున్నారు. పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. పశ్చిమం వైపు ఐదు అంతస్థులు, ఉత్తర, దక్షిణం వైపు నాలుగు, తూర్పు వైపు మూడు అంతస్థులతో ప్రస్తుతం నిర్మాణాలు సాగుతున్నాయి. భౌతికంగా సుమారు 40 శాతం పనులు పూర్తయ్యాయి. వ్యయంరీత్యా చూసినప్పుడు అనేక పనులు ఇంకా చేయాల్సి ఉంది. మొత్తం ఏడు అంతస్థులతో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. అత్యాధునిక డిజైన్లతో నిర్మిస్తున్నాం. ఎప్పటికప్పుడు సీఎం, మంత్రి పనులను తనిఖీ చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వచ్చే దసరా పండుగ నాటికి సచివాలయం పనులు పూర్తిచేస్తాం.
సచివాలయం నిర్మాణం కోసం వర్కింగ్ ఏజెన్సీ ఎంపికలో నిబంధనలు ఉల్లంఘించినట్టు విమర్శలు వచ్చాయి కదా ?
జవాబు: అలాంటిదేమీ లేదు. ఆర్ అండ్ బీ స్టాండర్ట్ నిబంధనల మేరకే సచివాలయానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాం. ఫైనాన్సియల్, టెక్నికల్ బిడ్లను పక్కాగా అధ్యయనం చేశాం. అన్ని అర్హతలు పరిశీలించాకే షాపూర్జీ-పల్లోంజీ వర్కింగ్ ఎజెన్సీని ఎంపిక చేసి పనులు అప్పగించాం.
జాతీయ రహదారుల సంగతేంటి ?
ఇటీవల జాతీయ రహదారుల నిర్మాణంలోనూ వేగం పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 4704 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు తెలంగాణలో 2511 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటి నిర్మాణం నిరంతర ప్రక్రియ. జాతీయ సగటుతో పొలిస్తే తెలంగాణలో అత్యధికంగా హైవేలు ఉన్నాయి.
హైదరాబాద్- విజయవాడ హైవే పరిస్థితేంటి ?
జవాబు: ఎల్ బి నగర్ నుంచి జీఎంఆర్ టోల్ గేట్ వరకు ఆరు లేన్లుగా ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు రూ. 550 కోట్లు కేటాయించారు. సర్వీసు రోడ్లు సైతం నిర్మిస్తాం. ఆరాంఘర్- శంషాబాద్, ఉప్పల్ కారిడార్, బెంగళూరు హైవే పనులతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలను కచ్చితంగా నివారించవచ్చు.
రీజినల్ రింగ్ రోడ్డులో ఆర్ అండ్ బీ బాగస్వామ్యం ఉందా ?
అవును. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో రాష్ట్ర ఆర్ అండ్ బీకి పాత్ర ఉంది. ఉత్తర భాగం పనులు జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏ) చేపట్టగా, దక్షిణ భాగం పనులకు డీపీఆర్ తయారుచేసే పనిలో ఆర్ అండ్ బీ ఉంది. ఇంకా కొంత సమయం పడుతుంది. ఈ మేరకు వేగంగా కసరత్తు జరుగుతున్నది.