Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆలగడపలో పారిశ్రామిక పార్క్( సెజ్) పేరిట చేపట్టిన భూసేకరణను రద్దు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శనివారం ఆలగడపలో ఏర్పాటుచేసే సెజ్తో భూములు కోల్పోయే రైతులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిడ్మానేరు, మల్లన్నసాగర్, పోలేపల్లి పేరిట సేకరించిన భూముల మాదిరిగానే సెజ్ల పేరుతో భూములు సేకరించాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లోనే భూ సేకరణ జరుగుతుందనీ, తద్వారా పేద రైతుల భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వెంటనే భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సెజ్ వస్తే భద్రత ఉండదనీ, భవిష్యత్తూ ఉండదని చెప్పారు. భూ సేకరణ నిలిపివేసేంత వరకు నిర్వాసితులతో కలిసి ఉద్యమాన్ని చేపడతామన్నారు. రైతులు సంఘటితంగా ఉండి పోరాడి భూములు కాపాడుకోవాలని తెలిపారు. అరుణోదయ్య సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ.. బహుజన బతుకమ్మ పేరిట నిర్వాసితులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఐక్య ఉద్యమాలతోనే భూములు దక్కుతాయని చెప్పారు. సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి, పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర నాయకులు రాఘవాచారి, నాయకులు అంబటి నాగయ్య, వేనేపల్లి పాండురంగారావు, డీఎస్ఎస్ఆర్ కృష్ణ, పందులసైదులు, చిన్న రాయపూడి, రైతులు పాపయ్య, సుబ్బారావు, కృష్ణయ్య, స్వామి, రామరాజు, నాగయ్య, రైతుసంఘం నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, నాగయ్య, లింగమయ్య, సైదులు, తదితరులు పాల్గొన్నారు.