Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ
- సామాన్యుల బతుకు ఛిద్రమే : మానవ హక్కుల వేదిక సమావేశంలో మార్పు శరత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రిజర్వేషన్లను ఎత్తేయటమే బీజేపీ ఉద్దేశమనీ, అందుకే ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నదని మార్పు శరత్ చెప్పారు.వాటిని ప్రయివేటీకరిస్తే సామాన్యుల జీవన చిత్రం చిద్రమైపోతుందన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.రాజు అధ్యక్షతన శనివారం 'క్రోని పెట్టుబడీదారులకు ప్రభుత్వ రంగ సంస్థల అప్పగింత- పరిణామాలు' అనే అంశంపై జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేటు రంగం ప్రజలకు సేవలందించటంలో విఫలం కావటంతోనే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలో ఒక్కో రంగంలో ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పారని గుర్తుచేశారు. ప్రయివేటు చేతులెత్తేయటం, ఉపాధి కల్పించకపోవటం, రిజర్వేషన్లు లేకపోవటం, కార్మికుల భద్రతను పట్టించుకోకపోవటం, ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితి నుంచి మన దేశాన్ని గట్టెక్కించటం తదితర ప్రయోజనాల కోసం ప్రభుత్వరంగ సంస్థలు వచ్చాయని తెలిపారు. తదనంతర కాలంలో అవి లాభాలను గడించాయి. కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో ఆదాయాన్ని సమకూర్చాయి. బలహీనవర్గాలకు రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చాయి. అవి పారదర్శకంగా పని చేస్తున్నాయి. వాటిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించారని చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక పీఎస్యూల్లో ఉన్న 1.20 కోట్ల ఉద్యోగుల్లో 20 లక్షల మందిని తొలగించిందని విమర్శించారు. అయితే ఉన్న ఉద్యోగుల్లోనూ 22.4 శాతంగా ఉన్న కాంట్రాక్ట్, క్యాజువల్ సిబ్బంది శాతాన్ని 34.7 శాతానికి పెంచిందనీ, ఇదే సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందన్నారు. గత ఐదేండ్లలో కేంద్రానికి ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్ల రూపంలో రూ.26,104 కోట్లు ఇచ్చాయని తెలిపారు. రోడ్లు, జలవిద్యుత్, రైల్వేలు, ఆర్థిక సంస్థలు ఇలా ప్రతి దాన్ని ప్రయివేటు చేసేందుకు కుట్ర పన్నారనీ, ఇందుకు నష్టాలను సాకుగా చూపిస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా వాటిని నష్టాల్లోకి నెడుతున్నారంటూ విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రను ఉదహరించారు. ప్రయివేటీకరణతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనీ, రెగ్యులర్ ఉద్యోగాలు తగ్గిపోతాయనీ, కార్మికులు, ఉద్యోగుల జీవిత భద్రత ప్రశ్నార్థకమవుతుందనీ, ప్రజా ఉమ్మడి సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు. ఇప్పటికే దేశంలో రైతాంగ ఉద్యమం బీజేపీ విధానాలపై పోరాడుతున్నదనీ, అదే స్థాయిలో రానున్న కాలంలో ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.