Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న కేసీఆర్
- ప్లీనరీ, హుజూరాబాద్ ఉప ఎన్నికపై మార్గదర్శనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామ, మండల కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో... క్షేత్రస్థాయిలో జోష్ నింపుకున్న అధికార టీఆర్ఎస్, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సీరియస్గా దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈనెల 25న హైదరా బాద్లోని హైటెక్స్ వద్ద గల హెచ్ఐసీసీలో ప్లీనరీని నిర్వహించనున్నా రు.అందులో ప్రతిపాదించాల్సిన తీర్మానాలు, రాష్ట్ర కమిటీ, పొలిట్బ్యూరోలో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్... ఆదివారం నాయకులు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీ ప్లీనరీతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యూహ, ప్రతి వ్యూహాలపై సీఎం వారితో సమాలోచనలు చేయనున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో నవంబరు 15న వరంగల్లో నిర్వహించబోయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణ గురించి కూడా ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడతారు. ఈ సభ కోసం ఈనెల 25న నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున ఆయా అంశాలపై కూడా కూలంకుషంగా చర్చించి, మార్గదర్శనం చేస్తారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా ఆదివారమే మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ నిర్వహించబోయే సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.