Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు ఇంటి వద్ద వైద్యం అందని దైన్యం
- మరమ్మతులకు నోచని వాహనాలు
- నెలల తరబడి జీతాలు రాక ఉద్యోగుల వెతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అందరికి వైద్యం అందించటం ప్రభుత్వ లక్ష్యం. అందరికి అందుబాటులోకి మెరుగైన వైద్యం తేవటానికే మా ప్రయత్నం. అందరి ఆరోగ్య డాటా రూపొందిస్తాం. తద్వారా ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో గుర్తించి అందుకు తగినట్టు ప్రాంతాలవారీగా వైద్యసేవలను విస్తరిస్తాం. వినగానే మూలన కూర్చున్న ముసలవ్వకు కూడా ప్రాణం లేచి వచ్చేంత హాయిగా వినిపించే మాటలివి. కొత్త సేవల సంగతేమో గానీ ఉన్న సేవల్ని నిర్వీర్యం చేయకపోతే చాలు అన్నట్టుగా క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న వాదన. బోధనాస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఆస్పత్రులున్నప్పటికీ ఆ వైద్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకెళ్లాల్సిన అవసరముందని నిపుణులు గుర్తించారు. వికలాంగులు, వయస్సు మళ్లిన వారు, చిన్న పిల్లలు, నిరుపేదలు స్వల్ప రోగాలకు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. తద్వారా అశాస్త్రీయమైన, అర్హత లేని వారిని నమ్ముకుంటుండటంతో ఆ రోగాలు తీవ్రమవుతున్నాయి. వీటి నివారణకు ఇంటి వద్దకే వైద్యం తీసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే 104 సేవలు. నిర్దేశించిన రోజున గ్రామంలోకి డాక్టర్లు, ఔషధాలు, నర్సులు నిర్దేశించిన గ్రామంలోకి వచ్చే ఫిక్స్ డ్ డే హెల్త్ సర్వీస్ (ఎఫ్ డీహెచ్ఎస్) సేవలవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సర్కారు దీనిని ప్రారంభించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 475 వాహనాలతో సేవలు కొనసాగాయి. రాష్ట్రావిర్భావం తర్వాత 197 వాహనాలు తెలంగాణకు రాగా 278 ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఆ రాష్ట్రానికి కేటాయించినవే కాకుండా రెట్టింపు సంఖ్యలో వాహనాలను పెంచి డాక్టర్లను నియమించుకుని సేవలను విస్తరించారు. తెలంగాణలో మట్టుకు దాదాపు 70కి పైగా వాహనాలు మరమ్మతులకు రాగా వాటిని వెంటనే సరి చేయకుండా జాప్యం చేస్తున్నారు. రూ.20 వేలకు పైగా ఖర్చయ్యే వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఒక్కో వాహనంలో మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్సు, హెల్త్ సూపర్ వైజర్, ఏఎన్ఎం, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉండాలని సేవల ప్రారంభ సమయంలోనే నిర్ణయించారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న వాహనాల్లోనూ కేవలం ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ తో సరిపెడుతున్నారు. పైపెచ్చు వాహనాలను ఆర్టీపీసీఆర్ టెస్టులకంటూ, వ్యాక్సినేషన్ కార్యక్రమానికంటూ మళ్లిస్తుండటంతో ఎఫ్ డీహెచ్ఎస్ సేవలు నామమాత్రంగా మారిపోయాయి.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఫార్మసిస్టులు చేయాల్సిన పనిని వారు లేకుండానే చేస్తుండటం కూడా విమర్శలు వస్తున్నాయి. ఎన్ సీడీ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్, అస్తమా, మూర్చవ్యాది గుర్తింపుతో పాటు గర్భిణీల సమస్యను చూసే ఆశావర్కర్లతో ఔషధాలు పంపిణీ చేస్తున్నారని తెలుస్తున్నది. ఔషధాల వాడకంతో పాటు ఏ సమయంలో ఎవరికి ఏ ఔషధం ఇవ్వాలనే విషయాలపై ఫార్మసి స్టులకు అవగాహన ఉంటుంది.
వారిని పక్కన పెట్టటమే కాకుండా షెడ్యూల్ హెచ్ కేటగిరీలోని మందులను సైతం ప్రజలకు ఇస్తుండటంపై కూడా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ముంగిట వైద్యానికీ, గాని ఉద్యోగుల పనికి ప్రత్యామ్నాయం చూపించకుండా నిర్వీర్యం చేయటం అనాలోచితమని ప్రజసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యోగుల సంక్షేమం మరిచిన సర్కారు
గత మూడు నెలలుగా జీతాలు రాకపోవటంతో ఇందులో పని చేసే 1375 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సేవలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు నెలజీతం వస్తేనే ఇబ్బందులు తప్పని చిరుద్యోగులకు సంబంధించిన ఫైలును క్లియర్ చేయకపోవటం గమనార్హం. దసరా ముందు తమకు జీతాలివ్వాలని ఉన్నతాధికారులకు పదే పదే మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. తొమ్మిదో పీఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ పే ఇచ్చారనీ, 11వ పీఆర్సీలో అలా కుదరదని జీతానికి 30 శాతం పెంచుతామని అది కూడా అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేచి చూస్తున్నాం...
104 వాహనాల సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఉద్యోగుల సంక్షేమం కోసం పలుమార్లు ఉన్నతా ధికారులకు వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) రాష్ట్ర కార్యదర్శి వి.విజయవర్థన్ రాజు తెలిపారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న 104 సేవలను పునరుద్ధరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే కలిసి వివరిస్తామని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే పోరాటాన్నే ఎంచుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు వైద్యసేవలందించే తమను ఉద్యమాలు చేసే అనివార్య పరిస్థితి కల్పించవద్దని రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- టీయుఎంహెచ్ఇయూ రాష్ట్ర కార్యదర్శి వి.విజయవర్థన్ రాజు