Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ రాజ్యస్థాపనకు ఆటంకమని బీజేపీ భావన
- అందుకే సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ : పొలిట్బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కులగణనపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వందనీతిని అవలంభిస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. హిందూ రాజ్య స్థాపనకు కులగణన ఆటంకంగా మారుతుందనే భయంతోనే మోడీ సర్కారు సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ను సమర్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, కుల భావనలు మూడు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయనీ గుర్తు చేశారు. సాంకేతిక, సంక్లిష్టత పేరుతో కులగణన చేయకుండా కేంద్రం మొకాలడ్డతున్నదని అన్నారు. తద్వారా ప్రజలకు అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకె) ఆధ్వర్యంలో 'కులగణన ఆవశ్యకత'పై వెబినార్ నిర్వహించారు. దీనికి ఎస్వీకె కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ 2021 జనాభా లెక్కల్లో భాగంగానే కులగణన చేయాలని డిమాండ్ చేశారు. బూర్జువా రాజకీయ పార్టీల వైఖరి సరిగ్గా లేదని అన్నారు. వామపక్ష పార్టీలు మాత్రం కులగణన చేయాలని కోరుతున్నాయని తెలియజేశారు. 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉండి 2021 జనాభా గణన సందర్భంగా కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కుల గణనతో నష్టం జరుగుతుందని చెబుతున్న కేంద్రం అసలు ఉద్దేశం అదికాదనీ, తమ హిందూ రాజ్యస్థాపనకు కులగణన అడ్డంఅవుతుందని భయపడుతున్నదని తెలిపారు. కులగణన చేయాలంటూ తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా,బీహార్ తదితర రాష్ట్ర శాసనసభలు తీర్మానాలు ఆమోదించాయని తెలిపారు. కులగణన కోసం రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలతోపాటు శాసనసభల ద్వారా కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం నినాదాలే కాకుండా స్పష్టమైన కార్యాచరణతో కులగణన విషయంలో కేంద్రం విధానాన్ని అడ్డుకోవాలని కోరారు. ప్రజాశ్రేయస్సు కోసమే కులగణన చేయడం లేదంటూ బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం, మతోన్మాదం పేరిట రెచ్చగొట్టిన బీజేపీ, కులం, కుల వ్యవస్థ విషయంలో రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నదన్నారు. కులం, కుల తత్వం, కులం వివక్ష పాతవేనని, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదన్నారు. 2011లో సమర్థించి, 2018లో కుల గణన చేస్తామని కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ రాజ్యసభలో ప్రకటించారనీ, 2021కి వచ్చేసరికి మాట మార్చారని విమర్శించారు. కుల గణన చేస్తే రిజర్వేషన్లు, వర్గీకరణ, కొత్త కులాల పేర డిమాండ్లు వస్తాయనే కారణంతో కులగణనకు అడ్డుపడుతున్నదని అన్నారు. అలాగే హిందూ రాజ్య స్థానకు నష్టం జరుగుతుందని భావిస్తున్నదన్నారు. కాంగ్రెస్, టిడిపి, ఇతరపార్టీలు డోలాయమానంలో ఉన్నాయని గుర్తు చేశారు. కులగణన అసాధ్యమేమి కాదన్నారు. 1931 జనాభా లెక్కల్లో బ్రిటీషువాళ్లు కులగణన చేశారనీ, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కులగణన ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. జనాభా గణనలో భాగంగా ఎస్సీ, ఎస్టీల లెక్కలు ఎలా తీస్తారో, అలాగే బీసీల లెక్కలూ సేకరించాలని కోరారు. అప్పుడే రాజ్యాంగ హక్కులు అందరికి సమానంగా అందుతాయని గుర్తు చేశారు. లేకపోతే అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ ప్రాతిపదికన కులగణన చేస్తే ఎలాంటి సమస్యలూ రావన్నారు. దేశంలో 80 శాతం హిందువులు ఉన్నారని ఎలా చెబుతున్నారని అడిగారు. బీజేపీ ద్వంద ప్రమాణాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాల మూలంగా కులతత్వం, మతతత్వం పెరిగిందన్నారు. సమాజంలో కుల, మత భావాలను పాలకులు తమ అవసరాల కోసం పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినా ఆర్థిక, సామాజిక, విద్యా విషయాల్లో పేదలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. అగ్ర కులాల్లో పేదలు, ధనికులు ఎంత మంది ఉన్నారనేది కులగణన ద్వారా తేలుతుందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకుంటే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. కేరళలో 1951లోనే కులగణన చేశారనీ, ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ఆ లెక్కల మేరకే సంక్షేమ పథకాలను అమలుచేశారని గుర్తు చేశారు. కుల గణన ఎవరికి వారే చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించడాన్ని ఖండించారు. కేంద్రమెందుకు చేయదని ప్రశ్నించారు. హిందూ మతంలో అందరూ సమానం, అందరూ ఒక్కటే అని బీజేపీ చెప్పడం లేదనీ, కుల వ్యవస్థను కాపాడటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. తద్వారా ప్రజలను విభజించి పాలించి హిందూ రాజ్యస్థాపనకు పూనుకోవాలని భావిస్తున్నదన్నారు.
సంఘ్ పరివార్ శక్తులు, బీజేపీ కాశ్మీర్ను ముక్కలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరళీకరణ విధానాల మూలంగా దేశంలో రిజర్వేషన్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. మోడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం, అమ్మేయడం చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ రంగసంస్థలు లేకుండా చేసిన తరువాత రిజర్వేషన్లను ఎక్కడ అమలుచేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడున్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తేయబోరని నమ్మకమేంటని అడిగారు. మానిటైజేషన్తో ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా దెబ్బతీస్తున్నారని అన్నారు. ఎయిర్ ఇండియాను అమ్మేశారని, స్లీల్ప్లాంట్ను అమ్మకానికి పెట్టారని చెప్పారు. రైల్వేలు, టెలికాం, విద్యుత్, ట్రాన్స్మిషన్, పంపిణీ విద్యారంగాల్లో ప్రయివేటీకరణ వేగంగా అమలుచేస్తున్నారనీ, ఆమేరకు ఆయా తరగతులు ప్రభావతమై నష్టపోతాయని గుర్తు చేశారు. కులగణన పోరాటాలు, ఉద్యమాలకు సాధనంగా, ఆయుధంగా ఉపయోగపడుతుందనే భయమే బీజేపీ వ్యతిరేకతకు కారణమన్నారు. లౌకికవాద పరిరక్షణపాటు మతోన్మాద వ్యతిరేక పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.