Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరుములు.. మెరుపులతో.. భారీ వర్షం
- హైదరాబాద్లో రోడ్లన్నీ జలమయం
- జడ్చర్లలోని శివాజీ నగర్ రోడ్డుపై ప్రజలు రాస్తారోకో
- మంచిర్యాలలో వాగులో కొట్టుకుపోయిన ఎద్దులు మృతి
నవ తెలంగాణ- విలేకరులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంటలు నీటమునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. హైదరాబాద్లో కుండపోత కురిసింది. మహబూబ్నగర్ జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యధికంగా సరూర్నగర్లో 10.6 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా లింగోజీగూడ 6.7సెం.మీ నమోదయింది. మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్నగర్ డివిజన్ పరిధి, మీర్జాలగూడలో చిన్మయి స్కూల్ మార్గంలో వర్షపు నీటితో రోడ్డు జలమయమయింది. ఉప్పల్ పరిధిలోని లోతట్టు కాలనీలు, రోడ్లు వరదనీటితో నిండిపోయాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. అంబర్ పేట పరిధిలోని పలు ప్రాంతాలలో ఇండ్లలోకి, రోడ్లపైకి వరద నీరు వచ్చింది. చెట్లు విరిగాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ముసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. గోల్నాక, అంబర్ పేట, బాపూనగర్, మల్లికార్జున్ నగర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్, బతుకమ్మ కుంట, అన్నపూర్ణ నగర్, వడ్డెర బస్తీ, కష్ణానగర్, నింబోలి అడ్డా, కాచిగూడ తదితర బస్తీలలో ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్లోని లోతట్టు ప్రాంతాలు వర్షం వల్ల నీటమునిగాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్ సహా చాలా ప్రాంతాల్లో రోడ్లపై, కాలనీల్లో వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాకపోకలకు ఆటంకం కలిగింది. కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఎల్వీ ప్రసాద్ చౌరస్తా వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగింది. బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో కొన్నిచోట్ల రిపేర్లకోసం గుంతలు తవ్వి వదిలేయడంతో వర్షంవల్ల ఇబ్బందిగా మారింది. ఓ యువకుడు బైక్పై వెళ్తూ మ్యాన్హోల్ వద్ద కిందపడిపోయాడు.. మళ్లీ లేచి వెళ్లడంతో తృటిలో ప్రమాదం తప్పింది. వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
ఇండ్లలోకి నీరు చేరడంతో ఆగ్రహించిన కాలనీవాసులు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ పట్టణమంతా జలమయమై పలు కాలనీలు నీట మునిగాయి. మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన 16 వ వార్డు నటరాజ్ కాలనీ, శివాజీ నగర్ కాలనీ, 19 వ వార్డు ఎర్ర సత్యం కాలనీ, మూడవ వార్డు లోని రాజీవ్ నగర్ కాలనీలలో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శివాజీ నగర్ కాలనీ మొత్తం నీట మునగడంతో ప్రజలు ఎమ్మెల్యే డౌన్.. డౌన్.. అంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కమిషనర్ వెంటనే చర్యలు చేపట్టాలనీ, కాలనీలో పర్యటించాలని మున్సిపల్ చైర్మెన్, నాయకులంతా కేవలం ఎన్నికల ముందే వస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా కాలనీవాసులు రోడ్డు పైన కూర్చొని ధర్నా నిర్వహించారు. కల్వకుర్తి రోడ్డులో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లోకి నీళ్లు వచ్చాయి. పట్టణానికి చెందిన రాఘవేందర్ వ్యక్తి నటరాజ్ కాలనీలో పొంగిపొర్లుతున్న కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
వాగులో కొట్టుకుపోయిన ఎద్దులు మృతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి చేతికొచ్చిన సోయా పంట తడిసి ముద్దయింది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వాగులు పొంగి ఎడ్లబండి కొట్టుకుపోయి రెండు ఎద్దులు మృతి చెందాయి. రైతు బయటపడ్డాడు.