Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హింసతో అణచివేసే ప్రయత్నాలు
- రైతాంగ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం: ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ విజ్జూ కృష్ణన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, హింసతో అణచివేసేందుకు బీజేపీ కుట్రలను పన్నుతున్నదని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జూ కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యపోరాటాలతో వాటిని తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదనీ, సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు హర్యానా, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో హింసను ప్రేరేపిస్తూ రైతులపైకి పోలీసులను, ఆర్ఎస్ఎస్ గుండాలను ఉసిగొల్పిందని చెప్పారు. ఏడాది కాలంగా శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని హింసాత్మకంగా మార్చేందుకు కుట్ర పన్నిందని తెలిపారు. అయినా పాలకపక్షానికి బెదిరేది లేదనీ, ఇక ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రైతాంగ ఉద్యమం ఢిల్లీకి పరిమితమైంది కాదనీ, ఇది దేశవ్యాప్తమైనదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జోడించి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రైతు నేతలకు విజ్జూ సూచించారు.
కేరళ మాదిరిగా ప్రత్యామ్నాయం వైపు పయనించాలి
ప్రత్యామ్నాయ పంటల కోసం 19 రకాల పండ్లు, కూరగాయలకు ధరలు నిర్ణయించి కేరళ వామపక్ష ప్రభుత్వం రైతులను ప్రోత్సహించిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ తెలిపారు. సమావేశంలో సంఘం నివేదికను ఆయన ప్రవేశపెట్టారు. అదే తరహాలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ప్రత్యామ్నాయ పంటలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో కందులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తే రైతులు పండించారనీ, కాని ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం పోయిందని గుర్తుచేశారు.
ఏకపక్షంగా విత్తనాల సరఫరాను ఆపటం సమస్యకు పరిష్కారం కాదని హితువు పలికారు. ప్రభుత్వం పంటల నష్టం అంచనా వేయలేదనీ, తద్వారా కేంద్ర ప్రణాళికా సంఘం నుంచి వచ్చిన నిధులకు, మ్యాచింగ్ నిధులు కలిపి రైతులను ఆదుకునే అవకాశం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చర్యలకు నిరసనగా నేడు నిర్వహించనున్న రైల్ రోకోలో పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి వ్యవసాయ ప్రణాళిక లేదు
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ, రుణ ప్రణాళిక లేదనీ, సీఎం కేసీఆర్ నోటికి ఏది తోస్తే అదే ప్రణాళికలా అమలు చేస్తున్నారని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి విమర్శించారు. గతంలో ఉన్న ప్రణాళికే తప్ప ...భూసార పరీక్షలు చేయలేదనీ, ఏ భూమిలో ఏ పంట పండుతుందో కూడా తెలియదన్నారు. రాష్ట్రంలో 40 లక్షల టన్నుల కూరగాయల వినియోగం ఉంటే 30 లక్షల టన్నుల పంటే వస్తున్నదనీ, నూనెలు, పప్పులు తదితరాలన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. యాసంగికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
రైతుల చైతన్యంతోనే ......
రైతుల చైతన్యంతోనే పాలకులు భయపడతారనీ, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడుతారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. ఒకవైపు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తెస్తూ, మరోవైపు విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచుకునేందుకు కార్పొరేట్లకు అనుమతిలిస్తూ, ఇంకోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ఉద్దేశపూర్వంగా నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో బీజేపీ విధానాల పట్ల అసంతృప్తి పెరిగిందనీ, ఇక పతనమే మిగిలిందన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఆ పార్టీ పతనం ప్రారంభమవుతుందన్నారు. ఇటీవల మరణించిన రైతులకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మాదినేని రమేష్, బండ శ్రీళైసం, కున్ రెడ్డి నాగిరెడ్డి, ఎం.శ్రీనివాస్, కుమారస్వామి, మధుసూదన్ రెడ్డి, బాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మధుతో పాటు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.