Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 208 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 45,418 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 42,165 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,253 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,361 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,929 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 62 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
23 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం జీహెచ్ఎంసీతో సహా 23 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
నాలుగు జిల్లాల్లో తగ్గిన కేసులు
భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
ఆ జిల్లాల్లో జీరో....
నారాయణపేటజిల్లాల్లో ఐదు రోజులుగా, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో నాలుగు రోజులుగా, కొమురంభీం ఆసిఫాబాద్, జిల్లాల్లో మూడు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. జగిత్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో రెండు రోజులుగా ఎలాంటి మార్పు లేదు.
ఆ జిల్లాల్లో ఒక్కసారిగా....
కొన్ని జిల్లాల్లో కేసులు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. గత కొన్ని రోజులుగా ఒకట్రెండు కేసులు మాత్రమే వస్తున్న ఆ జిల్లాల్లో ఒక్కసారిగా పెరిగినట్టు తెలుస్తున్నది. కరీంనగర్ లో తొమ్మిది నుంచి 14కు, మంచిర్యాలలో రెండు నుంచి 14కు, మేడ్చల్ -మల్కాజిగిరిలో నాలుగు నుంచి 10కి, పెద్దపల్లిలో ఒకటి నుంచి 10కి, రంగారెడ్డిలో తొమ్మిది నుంచి 13కు, వరంగల్ రూరల్ జిల్లాలో ఒకటి నుంచి 11కు పెరిగాయి.